షాకింగ్: చైనా పైచేయి.. గాల్వాన్ స్వాధీనం? చర్చల్లో భారత్ అంగీకరించిందా? డ్రాగన్ సైన్యం తిరిగొస్తే?
గడిచిన రెండు నెలలుగా భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న టెన్షన్ ఎట్టకేలకు తగ్గుముఖం పట్టింది. ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి సైన్యాలను ఉపసంహరించుకునేందుకు అంగీకారం కుదరిందని, డీఎస్కలేషన్ గా పిలిచే ఆ ప్రక్రియ వేగవంతమైందని భారత్, చైనా ప్రభుత్వాలు సోమవారం ప్రకటనలు చేశాయి. అయితే సైనిక, దౌత్య మార్గాల్లో జరిగిన చర్చల్లో అసలేం మాట్లాడుకున్నారు? ఏయే అంశాలపై అంగీకారం కుదిరిందనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఈలోపే.. 800 మీటర్ల భారత భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకుందని, ఆ తర్వాతే బఫర్ జోన్ నుంచి వెనక్కి తగ్గే అంగీకారం కుదిరిందని ప్రఖ్యాత 'ఇండియా టుడే' సంచలన కథనాన్ని ప్రచురించింది.

ఘర్షణ జరిగిన ఆ ప్రాంతాన్నే..
తూర్పు లదాక్ లో గాల్వాన్ లోయలోని 14వ పెట్రోలింగ్ పాయింట్(పీపీ14) వద్ద జూన్ 15న భారత్, చైనా బలగాలు హింసాత్మక ఘర్షణకు దిగాయి. నాటి ఘటనలో మనవైపు 21 మంది జవాన్లు ప్రాణాలుకోల్పోగా, చైనా వైపు ఎంత మంది చనిపోయారనేది ఇప్పటికీ వెల్లడికాలేదు. కాగా, ఘర్షణ తర్వాత గాల్వాన్ లోయ మొత్తం తమదేనంటూ చైనా సార్వభౌమత్వాన్ని ప్రకటించుకుంది. ఎల్ఏసీ నుంచి రెండు వైపులా బలగాలు 1.5 కిలోమీటర్లు వెనక్కి మళ్లాయని భారత్, చైనా విదేశాంగ శాఖలు సోమవారం అధికారిక ప్రకటన చేసే సమయానికి.. గాల్వాన్ మొత్తాన్నీ కాకుండా.. పీపీ14లోని 800 మీటర్ల భూభాగాన్ని మాత్రం చైనా తన స్వాధీనంలోనే ఉంచుకున్నట్లు ‘ఇండియా టుడే' తెలిపింది.

మీటింగ్ మినిట్స్ లోనూ దీనిపైనే..
మే 5 నాటికే వేల సంఖ్యలో చైనా బలగాలు.. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో తిష్టవేసి, భారత్ పై కవ్వింపులకు దిగింది. కొంచెం ఆలస్యంగానైనా భారత్ సైతం చైనాకు సరిసమానంగా సైన్యాలను మోహరించింది. అయితే, ఏప్రిల్ నెలలో బెటాలియన్ కమాండర్ల స్థాయిలో జరిగిన చర్చల్లోనే చైనా.. గాల్వాన్ పై తనకు హక్కున్నట్లు చెప్పుకుందని, ఆ తర్వాత వివిధ స్థాయిల్లో జరిగిన చర్చల్లోనూ ఇదే అంశం ప్రధానంగా ఉంటూ వచ్చిందని, ఆ మేరకు మీటింగ్ మినిట్స్ లో రాసుకున్న విషయాలు తమకు విశ్వసనీయంగా తెలిశాయని ‘ఇండియా టుడే' పేర్కొంది. ఏప్రిల్ లో చర్చలు విఫలమైన తర్వాతే.. మే మొదటి వారంలో చైనా బలగాలను దింపిందని వెల్లడైంది.

1959 ఒప్పందం ప్రకారమేనంటూ..
భారత్, చైనా మధ్య సరిహద్దులు నిర్ధారణపై 1959లో జరిగిన చర్చల్లో.. ఇప్పటి 14వ పెట్రోలింగ్ పాయింట్ తనకే చెందాలనే ఒప్పందం కుదిరినట్లు చైనా వాదిస్తున్నదని, 61 సంత్సరాల తర్వాత మళ్లీ ఈ అంశాన్ని లేవనెత్తడానికి చైనాకు పలు కారణాలున్నాయని ‘ఇండియా టుడే' కథనంలో పేర్కొన్నారు. అయితే, దశాబ్దాలుగా చైనా ఎత్తుగడలను తిప్పికొడుతూ వస్తోన్న భారత్.. ప్రస్తుతం కొనసాగుతోన్న డీఎస్కలేషన్ ప్రక్రియలోనూ డ్రాగన్ ను గుడ్డిగా నమ్మే అవకాశం లేదని, ప్రస్తుతానికి బఫర్ జోన్ లో ఎవరూ తిరగొద్దన్న అంగీకారానికి చైనా కట్టుబడి ఉంటుందని భారత బలగాలు విశ్వసించడం లేదంటూ కథనంలో రాసుకొచ్చారు.

ఆ వైరల్ ఫొటో వెనుక పెద్ద కథ..
గాల్వాన్ వ్యాలీలో ఉద్రిక్తతలు తగ్గేలా బలగాల ఉపసంహరణకు అంగీకారం కుదిరిందన్న వార్తలు వెలువడిన తర్వాత 1962నాటి న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఒకటి ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. సరిగ్గా 58 ఏళ్ల కిందట, ఇదే జులై నెలలో ప్రచురితమైన ఆ వార్తలో.. ‘‘గాల్వాన్ పోస్టు నుంచి చైనా బలగాలు వెనుదిరిగాయి.. భారత జవాన్ల పరాక్రమంతో చైనా తోకముడిచింది.. ఢిల్లీ హెచ్చరిక ఫలితంగానే ఇది జరిగింది''అని శీర్షికలో రాశారు. ప్రస్తుత డీఎస్కలేషన్ ప్రక్రియలోనూ మనం ఇదే తరహా వార్తలు చదువుతున్నాం. అయితే, 1962 జులై 15న ఆ వార్త ప్రచురితమైన 91 రోజుల తర్వాత భారత్, చైనా మధ్య భీకర యుద్ధం ప్రారంభమైంది. కాబట్టి, ఈసారి కూడా చైనా తన బుద్ధి చూపించుకునే అవకాశాలు లేకపోలేవని ‘ఇండియా టుడే' కథనంలో తెలిపారు.
Recommended Video

బ్యాక్ ఎండ్ చర్చల వల్లే..
సరిహద్దు సమస్యలపై భారత్, చైనా మధ్య సైనిక, దౌత్య మార్గాల్లో చర్చలు జరగడం దశాబ్దాలుగా వస్తున్నదే. కేంద్ర పెద్దలతో సంప్రదింపుల తర్వాత తీసుకున్న నిర్ణయాలను ఆ రెండు విభాగాలే చైనా కౌంటర్పార్ట్స్కు వెల్లడించేవి. అయితే, సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా ఈసారి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో రెండు గంటలపాటు ఫోన్లో సంభాషించిన తర్వాతగానీ రెండు నెలల స్టాండాఫ్ కు తెరపడలేదు. సమస్యల్ని పరిష్కరించుకోడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ వాడుకోవడం సరైందే అయినప్పటికీ, దోవల్ ప్రయత్నాన్ని ‘బ్యాక్ ఎండ్ ప్రక్రియ' అనే అర్థంలో ‘ఇండియా టుడే' అభివర్ణించింది. ఈ అంశంలో ఢిల్లీ పెద్దలు.. సైనికుల మనోభావాలను పరిగణలోకి తీసుకోలేదని, తూల్పు లదాక్ లో తాత్కాలికంగా ఉద్రిక్తతలు తగ్గడంపైనే దృపెట్టారుగానీ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లోని ఎల్ఏసీ వద్ద కూడా చైనాను నిలువరించే ప్రయత్నమేదీ జరగలేదని కథనంలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications