లదాక్లో ఇంకా చైనా కదలికలు -సైన్యం పూర్తి ఉపసంహరణకు భారత్ పట్టు -నేడు 11వ రౌండ్ చర్చలు
భారత్, చైనా సరిహద్దుల వెంబడి ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనగా, సైనిక ఉపసంహరణ ఒప్పందాలను సరిగా అమలు చేయకుండా డ్రాగన్ తోకజాడిస్తున్నది. దానిని దారిలోకి తెచ్చుకునే క్రమంలో భారత్ కీలక చర్చలకు సిద్ధమైంది. భారత్-చైనా సైనిక అధికారుల మధ్య 11వ రౌండ్ చర్చలు శుక్రవారం జరగనున్నాయి..
ఎల్ఏసీ వెంబడి తూర్పు లదాక్ లో ఏడాదిపాటు సాగిన ఉద్రిక్తతలకు తెరదించుతూ సరిహద్దుల నుంచి బలగాలను వెనక్కి పంపేయాలని రెండు దేశాలూ ఒప్పందాలు చేసుకోవడం తెలిసిందే. ఆ మేరకు కీలక జోన్ల నుంచి సైన్యాల ఉప సంహరణ కూడా పూర్తయింది. పాంగాంగ్ సరస్సు నుంచి ఇరు దేశాల దళాల ఉపసంహరణ ఫిబ్రవరిలో పూర్తయిన సంగతి తెలిసిందే. కానీ అదే తూర్పు లదాక్ లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెప్సాంగ్ ప్లెయిన్స్ వంటి ప్రాంతాలను చైనా పూర్తిగా ఖాళీ చేయలేదు.

తూర్పు లదాక్ నుంచి చైనా బలగాలను పూర్తిగా వెనక్కు పంపడంపైనే శుక్రవారం నాటి చర్చలో ప్రధానం కానుంది. చుషూల్ సెక్టార్ వేదికగా నేటి ఉదయం 10:30 నుంచి చర్చలు ప్రారంభం కానున్నాయి. పాంగాంగ్ సరస్సు నుంచి ఇరు దేశాల దళాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఇరు దేశాల కార్ప్స్ కమాండర్లు 10వ రౌండ్ చర్చలు జరిపారు. తదుపరి రౌండ్ (11వ రౌండ్) కార్ప్స్ కమాండర్ లెవెల్ చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications