భారత ట్యాంకర్ పై అమెరికా ఘాతుకం: ముగ్గురు నావికులు కన్నుమూత
ఒమన్ గల్ఫ్లో అమెరికా సైనిక దాడికి గురైన 'సెట్టెబెల్లో' (Settebello) ట్యాంకర్లో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందినట్లు నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ అధికారికంగా వెల్లడించారు. ఒమన్ తీరంలో ఈ నౌకపై దాడి జరిగిన సమయంలో మొత్తం 24 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మిగిలిన 21 మందిని రక్షించినట్లు తెలిపారు. ఈ విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ సహకారం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అమెరికా సైనిక దళాల ఆదేశాలను పాటించకపోవడంతో ఆ నౌకపై తాము ఖచ్చితమైన (precision) దాడి చేసినట్లు అమెరికా రక్షణ విభాగం సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ నుండి చమురును రవాణా చేస్తున్నందున ఈ దాడులు చేసినట్లు పేర్కొంది. హార్ముజ్ జలసంధి ప్రస్తుతం తమ ఆధీనంలో ఉందని వివరించింది. సెట్టెబెల్లొ నౌక పదే పదే ఆదేశాలను ధిక్కరించడంతో, తమ యుద్ధ విమానం దాని ఇంజిన్ రూమ్ను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు వివరించింది.

ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా సైనిక చర్యను ఖండిస్తూ, ఢిల్లీలోని అమెరికా మిషన్ డిప్యూటీ చీఫ్కు భారత్ సమన్లు జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, అమెరికా చార్జ్ డి అఫైర్స్ జేసన్ మీక్స్కు సమన్లు ఇచ్చారు. తన కార్యాలయానికి పిలిపించి వివరణ తీసుకన్నారు. ఈ ఘటనపై భారత్ తరపున తీవ్ర నిరసన తెలియజేశారు. భారతీయుల భద్రత విషయంలో దేశం తీవ్ర ఆందోళన చెందుతోందని అటు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కూడా స్పష్టం చేసింది.
జూన్ 9వ తేదీ రాత్రి 11:14 నిమిషాలకు ఈ దాడి జరిగినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. పలావు జెండాను కలిగి ఉన్న సెట్టెబెల్లో నౌకను అడ్డుకునే క్రమంలో సిబ్బంది అమెరికా దళాల సూచనలను పాటించనందునే ఈ చర్య అని పేర్కొంది. నౌక ప్రయాణిస్తున్న క్రమంలో దానిని నిలిపివేసేందుకు, హాని కలిగించకుండా ఉండేందుకు ఈ ఖచ్చితమైన దాడిని చేపట్టినట్లు అమెరికా సమర్థించుకుంది.
అదే సమయంలో ఒమన్ తీరం సమీపంలోని షినాస్ పోర్ట్ వద్ద భారత్ కే చెందిన ఎంటీ జల్ వీర్ (MT Jalveer) నౌకపైనా తాజాగా దాడి జరిగింది. ఈ విషయాన్ని ఒమన్ లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. వారం రోజుల వ్యవధిలోనే భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకపై దాడి జరగడం ఇది మూడవసారి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న భారతీయ నావికుల భద్రతపై ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
అమెరికా ఈ దాడికి పాల్పడిందా లేదా అనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. నౌకలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడానికి సంబంధించిన వీడియోలను కూడా భారత రాయబార కార్యాలయం పోస్ట్ చేసింది. దీనికి గల సమగ్ర కారణాలపై ఆరా తీస్తోన్నామని తెలిపింది.












Click it and Unblock the Notifications