మళ్ళీ పెరిగిన కరోనా కొత్తకేసులు; పైపైకి యాక్టివ్ కేసులు, ఈ రాష్ట్రాలలోనే 60శాతం పైగా!!
భారతదేశంలో కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 17,092 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, అలాగే కరోనా మహమ్మారి కారణంగా 29 మంది మరణించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం (జూలై 2) పంచుకున్న డేటా ప్రకారం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది.
గత 24 గంటల్లో దేశంలో మొత్తం 14,684 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ రేటు దాదాపు 98.54 శాతానికి చేరుకుంది. మొత్తం రికవరీ డేటా 4,28,51,590కి చేరుకుంది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం కోవిడ్-19 యాక్టివ్ కేసులు 1,09,568కి పెరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ఈరోజు వెల్లడించింది. నిన్న నమోదైన యాక్టివ్ కేసులు 1,07,189 కాగా తాజాగా, దాదాపు రెండు వేలకు పైగా యాక్టివ్ కేసులు పెరిగాయి.
క్రియాశీల కేసులలో భారీ జంప్ ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్కరోజే 2,379 కేసులు పెరిగాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.25 శాతం ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,25,168కి చేరింది. జూలై 2న రోజువారీ సానుకూలత రేటు 4.14 శాతంగా నమోదైంది. ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రంలో 3,599 కేసులు , మహారాష్ట్ర 3,249 కరోనా కొత్త కేసులు, తమిళనాడు 2,385 కేసులు , కర్ణాటక 1,073 కేసులతో కలిపి గత 24 గంటల్లో 10,360 తాజా కేసులు నమోదయ్యాయి. 60% కంటే ఎక్కువ ఇన్ఫెక్షన్లు ఈ రాష్ట్రాలలోనే నమోదయ్యాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 831 కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో 3,249 తాజా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో నాలుగు మరణాలు సంభవించాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్రలో మొత్తం కోవిడ్-19 సంఖ్య 79,79,363కి పెరిగిందని, మరణాల సంఖ్య 1,47,929కి పెరిగిందని ఆరోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది. గురువారం రాష్ట్రంలో 3,640 కేసులు నమోదు కాగా, మూడు మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4,189 మంది రోగులు కరోనా నుండి కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం 23,996 క్రియాశీల కేసులు మహారాష్ట్రలో ఉన్నట్టుగా తెలిపింది.