భారత్ లో అత్యంత వేడి నగరాలు: AQI Report
భారత్.. ప్రస్తుతం తీవ్ర వడగాల్పుల కేంద్రంగా మారింది. ప్రపంచంలో 20 అత్యంత వేడి నగరాల్లో 19 భారత్ లోనే ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయా నగరాలన్నింట్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రత 43 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకోవచ్చని అంచనా వేసింది. దీనిపై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఓ నివేదికను విడుదల చేసింది. ఈ పరిస్థితి బుధవారం (ఈ నెల 22) నుండి నాలుగు రోజుల వరకు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
ఇటువంటి విపరీతమైన ఉష్ణోగ్రతలు తరచుగా నమోదవడం.. వాతావరణ మార్పులు ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయనడానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ను దాటితే దాన్ని తీవ్ర వడగాల్పుల పరిస్థితిగా ప్రకటిస్తారు. తీవ్రమైన వేడి కారణంగా బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక నగరాలు వడగాల్పుల ఉధృతిని ఎదుర్కొంటున్నాయి.

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల జాబితాలో బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్లోని నగరాలు ఉన్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ను తాకాయి. బిహార్లోని భాగల్పూర్, ఒడిశాలోని తాల్చేర్, పశ్చిమ బెంగాల్లోని అసన్ సోల్ నగరాలు 44 డిగ్రీల సెల్సియస్తో అగ్రస్థానంలో ఉన్నాయి. బిహార్లోని బెగుసరాయ్, మోతిహారి, ముంఘేర్, భోజ్పూర్, సివాన్ వంటి అనేక నగరాలతో పాటు పశ్చిమ బెంగాల్, తూర్పు ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను నమోదు చేశాయి.
ప్రపంచంలోని టాప్ 20 అత్యంత వేడి ప్రదేశాలలో భారతదేశం వెలుపల ఉన్న ఏకైక ప్రాంతం.. నేపాల్లోని లుంబిని. భారత ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకకాలంలో విస్తృతంగా పెరగడం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. ఇది ప్రాంతీయ వడగాల్పులు కాదని, అతి పెద్ద వాతావరణ మార్పునకు సంకేతమని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ తీవ్రమైన వేడికి అనేక కారణాలు దోహదపడుతున్నాయని వారు వివరిస్తున్నారు.
ప్రధాన కారణాలలో ఒకటి.. భూమిపై అధిక సౌర తాపం. దీనివల్ల ఏప్రిల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగాయి. ఏప్రిల్ నెలను సాధారణంగా రుతుపవనాలకు ముందు వేడి కాలంగా పరిగణిస్తారు. ఉత్తర, మధ్య భారత్ లోని చాలా ప్రాంతాల్లో క్లియర్ స్కై ఉండటం వల్ల సౌర వికిరణం నిరంతరాయంగా భూమిని చేరుకొని వేడిని మరింత పెంచుతోంది.
మరొక ముఖ్యమైన కారణం యూరేషియా, హిమాలయాలలో శీతాకాలంలో మంచు కొరత. మంచు తగ్గడం వల్ల సూర్యరశ్మి అంతరిక్షంలోకి తక్కువగా ప్రతిబింబిస్తుంది. ఇది భారత ఉపఖండంలో ఉష్ణోగ్రత పెరుగుదలకు దారితీస్తుంది. ఇది ఈ సంవత్సరం వడగాల్పుల తీవ్రతను మరింత పెంచింది. మారుతున్న సముద్ర గాలులు కూడా ఈ పరిస్థితిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో పెరుగుతున్న సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, ఈఎన్ఎస్ఓ-న్యూట్రల్ పరిస్థితుల వైపు మారడం వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications