ప్రజాస్వామ్య దేశాల్లో పడిపోయిన భారత్ ర్యాంకు.. ఆందోళనలు, నిరసనలే కారణం
ఢిల్లీ: ప్రజాస్వామ్య దేశాల సూచికలో భారత్ ర్యాంకు ప్రపంచదేశాలతో పోలిస్తే 10 స్థానాల కిందకు పడిపోయింది.ప్రజాస్వామ్య దేశాల సూచికలో భారత్ 51వ స్థానంలో నిలిచింది. భారత్ ర్యాంకు పడిపోవడానికి కారణం దేశంలో నెలకొన్న అనిశ్చితే కారణంగా సర్వే ద్వారా వెల్లడైంది. దేశంలో జరుగుతున్న పౌరహక్కుల పోరాటాలు ప్రజాస్వామ్య సూచికలో భారత్ ర్యాంకును దిగజార్చాయని సర్వే పేర్కొంది.

పలు అంశాలపై పరిశోధన
డెమొక్రసీ ఇండెక్స్ను ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తయారు చేస్తుంది. ఎకనామిస్ట్ గ్రూపులో ఈ యూనిట్ పరిశోధన మరియు విశ్లేషణ విభాగంగా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 165 దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉందో స్టడీ చేసి ర్యాంకింగ్స్ ఇస్తుంది. ర్యాంకింగ్స్ ఇచ్చేందుకు కొన్ని అంశాలపై వీరు పరిశోధన చేస్తారు. ఇందులో ప్రధానంగా దేశంలో ఎన్నికల ప్రక్రియ, ప్రభుత్వం పనితీరు, రాజకీయ సంస్కృతి, పౌరహక్కులు, రాజకీయ భాగస్వామ్యం వంటివి అంశాలపై పరిశోధన విశ్లేషణ చేస్తారు. భారత్ను తీసుకుంటే 0-10 మార్కులకు గాను 2018లో 7.23 మార్కులు దక్కగా.. 2019కి అది 6.90 మార్కులకు పడిపోవడం విశేషం.

తొలి స్థానం నార్వే.. చివరి స్థానం ఉత్తర కొరియా
ఆసియా ఆస్ట్రేలియా దేశాలతో పోలిస్తే భారత్ 8వ ర్యాంకు దక్కించుకుంది. టైమూర్ లెస్ట్, మలేషియా, తైవాన్ దేశాల తర్వాత భారత్ స్థానం ఉంది. ఇక ప్రజాస్వామ్య దేశాల్లో 9.87 మార్కులతో తొలి స్థానంలో నిలించింది నార్వే. ఇక 1.08 మార్కులతో ఉత్తర కొరియా చివరి స్థానంలో నిలిచింది. 2.26 మార్కులతో చైనా కూడా చివరి స్థానంలో అంటే 153వ స్థానంలో ఉంది. 2019వ సంవత్సరంను ఆసియా ప్రజాస్వామ్య దేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొందని డెమొక్రసీ ఇండెక్స్ పేర్కొంది. ఇక మార్పులు వచ్చిన దేశాల్లో థాయ్లాండ్ అతిపెద్ద మార్పును చూసింది. 2018లో 1.69 మార్కులు ఉన్న థాయ్లాండ్ దేశం 2019కి 6.32 మార్కులను పొందింది.

ఎన్ఆర్సీ, సీఏఏ, జమ్మూ కశ్మీర్ అంశాలతోనే..
జమ్మూ కశ్మీర్ అంశం, వివాదాస్పదమైన ఎన్ఆర్సీ అంశాలతో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ అట్టుడికిందని సర్వే పేర్కొంది. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు ఆర్టికల్ 35(ఏ)ను రద్దు చేయడం ద్వారా ఆ రాష్ట్రానికి ఉన్న స్వయంప్రతిపత్తిని తొలగించినట్లయ్యిందని సర్వే పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దు ప్రకటనకు ముందు జమ్మూ కశ్మీర్లో బలగాలను కేంద్రం మోహరించిందని, ఇంటర్నెట్ను కట్ చేసి హక్కులను ప్రభుత్వం కాలరాసిందని డెమొక్రసీ ఇండెక్స్ పేర్కొంది. అంతేకాదు అస్సాంలో 1.9 మిలియన్ మందిని ఎన్ఆర్సీ జాబితా నుంచి తొలగించిందని పేర్కొంది. వీరిలో అధిక సంఖ్యలో ముస్లిం సామాజిక వర్గం వారు ఉన్నట్లు వెల్లడించింది.
ఇక చివరిగా చిలీ, ఫ్రాన్స్, పోర్చుగల్ దేశాలు అప్రజాస్వామిక దేశాల కేటగిరీ నుంచి పూర్తిస్థాయి ప్రజాస్వామ్య దేశాలుగా మారగా, మాల్టా దేశం మాత్రం పూర్తిస్థాయి ప్రజాస్వామ్య దేశం నుంచి అప్రజాస్వామిక దేశం కేటగిరీలోకి చేరినట్లు డెమొక్రసీ ఇండెక్స్ పేర్కొంది.












Click it and Unblock the Notifications