చైనాకు భారత్ వార్నింగ్: కటిక చీకట్లో వేల కి.మీ టార్గెట్ను ఛేదించే అణు క్షిపణి ప్రయోగం
న్యూఢిల్లీ: భారత్ మరో ఘనతను సాధించింది. తన రక్షణ బలాన్ని మరింత బలోపేతం చేసుకుంది. తన అమ్ముల పొదిలో అణు క్షిపణిని పొందుపరచుకుంది. ఈ మిస్సైల్ పేరు అగ్ని 5. కటిక చీకటిలో కూడా వేల కొద్దీ కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల శక్తి సామర్థ్యాలు ఉన్న బాలిస్టిక్ క్షిపణి ఇది. రాత్రి వేళ తొలిసారిగా దీన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ మిస్సైల్ టెస్ట్ను విజయవంతం చేయడం ద్వారా పొరుగులనే ఉన్న చైనాకు హెచ్చరికలను పంపించినట్టయింది. కొద్దిరోజులుగా అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన సరిహద్దు వెంబడి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనిక బలగాలు తరచూ ఘర్షణలకు దిగుతూ వస్తోన్న నేపథ్యంలో- భారత్- ఈ అణు క్షిపణి రాత్రిపూట ప్రయోగాన్ని విజయవంతం చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నట్టయింది.
చైనాతో తలెత్తుతోన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఈ ప్రయోగాన్ని చేపట్టడం, తన రక్షణ బలాన్ని మరింత పెంపొందించుకోవడం చర్చనీయాంశమౌతోంది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి రక్షణ మంత్రిత్వ శాఖ, డిఫెన్స్ రీసెర్చ్ లాబొరేటరీ అధికారులు ప్రయోగించారు. అగ్ని సిరీస్లో ఇది తొమ్మిదవ మిస్సైల్. ఇది 2012 లో మొదటిసారిగా ఈ క్షిపణిని పరీక్షించారు రక్షణ శాఖ అధికారులు.
ఈ మిస్సైల్ను ప్రయోగించడానికి ముందు నోటీస్ టు ఎయిర్ మెన్ (నోటం)ను జారీ చేశారు. ఈ అగ్ని 5 బాలిస్టిక్ క్షిపణి రేంజ్ 5,400 కిలోమీటర్లు. అంతకంటే ఎక్కువ దూరం గల లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం దీనికి ఉంది. ఈ క్షిపణి రేంజ్ 5,400లకు పైగా కావడం వల్ల మొత్తం ఆసియా దేశాలు, చైనా ఉత్తర భాగం, కొన్ని యూరప్ దేశాలు కూడా దీని పరిధిలోకి వచ్చినట్టయింది.
అగ్ని 1 నుంచి అగ్ని 4 వరకు గల క్షిపణుల సామర్థ్యం 700 నుంచి 3,500 కిలో మీటర్ల పరిధిని కలిగి ఉన్నాయి. వాటన్నింటినీ ఆర్మీ అధికారులు ఇప్పటికే సరిహద్దుల్లో వేర్వేరు ప్రాంతాల్లో మోహరింపజేశారు. ఇప్పుడు తాజాగా అగ్ని 5 వాటన్నింటికీ మించింది. ఏకంగా 5,400 కిలోమీటర్ల రేంజ్ను కలిగి ఉంది.