ఘర్ మే ఘుస్ కే మారేంగే: పాక్..ప్రశాంతంగా జీవించదు.. మహా వినాశనం తప్పదు
PM Modi at Adampur Air Base: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగిన యుద్ధం, శతృదేశ సైనికుల నుంచి ఎదుర్కొన్న ప్రతిదాడులు, మోర్టార్ షెల్స్ కాల్పుల మధ్య ఆందోళనకర వాతావరణం నెలకొన్న జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుకుంటోన్నాయి. సాధారణ జనజీవనం ఏర్పడుతోంది. ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమౌతోన్నారు.
ఈ పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హఠాత్తుగా పంజాబ్లో పర్యటిస్తోన్నారు. అక్కడి ఆదమ్పూర్ ఎయిర్ బేస్ను సందర్శించారు. ఎయిర్ వారియర్లతో భేటీ అయ్యారు. పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం, సీజ్ ఫైర్ తరువాత నెలకొన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.

నిజానికి ఇది అన్ ప్లాన్డ్ ప్రోగ్రామ్. నేటి ప్రధాని షెడ్యూల్లో ఆదమ్పూర్ ఎయిర్ బేస్ స్టేషన్ సందర్శన లేదు. పైగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కూడా దీనిపై ముందస్తు సమాచారం లేదని తెలుస్తోంది. అప్పటికప్పుడు ఆదమ్పూర్ ఎయిర్ బేస్ స్టేషన్ను సందర్శించాలని భావించారని, దీనితో రోజువారీ షెడ్యూల్లో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని సమాచారం.
భారత్- పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన రెండో రోజే ప్రధాని మోదీ ఆదమ్పూర్ ఎయిర్ బేస్ స్టేషన్ను సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైమానిక దళంతో మాట్లాడారు. వారితో ముచ్చట్లు పెట్టారు. సెల్ఫీ దిగారు. వారి భుజాలపై చేతులు వేసి, ఆప్యాయంగా పలకరించారు. వారు ఎదుర్కొన్న అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. పాకిస్తాన్ డ్రోన్లు, అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, వార్ ఎయిర్ క్రాఫ్ట్స్, క్షిపణులు.. ఇవన్నీ కూడా భారత వైమానిక బలం ముందు విఫలం అయ్యాయని అన్నారు. ఈ ఘనత- దేశంలోని అన్ని వైమానిక బేస్ స్టేషన్లకు దక్కుతుందని చెప్పారు. ప్రతి వాయుసేన యోధుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉగ్రవాదులు పాకిస్తాన్లో ప్రశాంతంగా జీవించడానికి చోటు లేదనే హెచ్చరికను పంపించామని ప్రధాని మోదీ అన్నారు. హమ్ ఘర్ మే ఘుస్ కే మారేంగే.. అని నినదించారు. ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల సామర్థ్యానికి అద్దం పట్టిందని మోదీ పేర్కొన్నారు. పాక్పై దాడులు సమయంలో దేశ సాయుధ దళాల సమన్వయం అద్భుతమని కీర్తించారు.
ఆర్మీ, నేవీ, వైమానిక బలగాలు అత్యంత సమన్వయంతో ఈ దాడులు సాగించాయని మోదీ ప్రశంసించారు. నౌకాదళం సముద్ర జలాలపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని, సైన్యం సరిహద్దును బలోపేతం చేసిందని, వాయుసేన దేశానికి రక్షణ కవచంలా నిలవడమే కాకుండా ఎదురుదాడులు సాగించిందని గుర్తు చేశారు.
బీఎస్ఎఫ్, ఇతర దళాలు అద్భుతమైన శక్తి సామర్థ్యాలు, పోరాట పటిమను ప్రదర్శించాయని పేర్కొన్నారు. భారత్పై కన్నెత్తి చూస్తే మహా వినాశనం తప్పదనే విషయాన్ని ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు, వాటిని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్ గుర్తించిందని ప్రధాని మోదీ అన్నారు. జీవించడానికి ఏ ఒక్క అవకాశం కూడా వారికి లభించదని తేల్చి చెప్పారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత లక్ష్మణ రేఖ ఇప్పుడు అత్యంత స్పష్టంగా ఉందని, ఇప్పుడు మరొక ఉగ్రవాద దాడి జరిగితే, ముఖం పగిలేలా సమాధానం ఇస్తామని పునరుద్ఘాటించారు. సర్జికల్ స్ట్రైక్, మొన్నటి వైమానిక దాడుల సమయంలో ఈ విషయాన్ని రుజువు చేశామని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
ఈ సందర్భంగా మహారాణా ప్రతాప్ వినియోగించిన గుర్రం చేతక్ కోసం రాసిన కొన్ని పంక్తులను ప్రధాని మోదీ ఉటంకించారు. ఆ పంక్తులు ఆధునిక భారతీయ ఆయుధాలకు కూడా సరిపోతాయని వ్యాఖ్యానించారు. వైమానిక దళం పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను 100 శాతం ఖచ్చితత్వంతో, 20-25 నిమిషాల్లోనే నేలమట్టం చేసిందని, ఇది- దేశ రక్షణ సామర్థ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటి చెప్పిందని అన్నారు.

పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులపై దాడి చేయడమే తమ ఉద్దేశమని, ఆ దేశం మాత్రం సరిహద్దుల్లో ఉన్న పౌరులు, జనావాసాలు, పౌర విమానాలపై కాల్పులు జరిపిందని మోదీ ఆరోపించారు. ఇది పాకిస్తాన్ పన్నిన కుట్ర అని విమర్శించారు. పౌర విమానాలకు వాయుసేన ఎటువంటి హాని కలిగకుండా రక్షణగా నిలువగలిగారని చెప్పారు.
పాకిస్తాన్ ఎదుర్కోలేని సరికొత్త, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తమ వద్ద ఉందని మోదీ పేర్కొన్నారు. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సవాళ్లు సైతం అదే స్థాయిలో ఎదురవుతున్నాయని చెప్పారు. సంక్లిష్ట, అధునాతన వ్యవస్థలను నిర్వహించడం, దాన్ని శతృతవులపై ఉపయోగించే సామర్థ్యం తమకు ఉందనే విషయాన్ని నిరూపించుకున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications