మళ్లీ భారత్ లోకి దూసుకొస్తున్న పాక్ డ్రోన్లు- 7 చోట్ల కూల్చేస్తున్న బలగాలు..!
పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ జరుపుతున్న ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ భారత్ పై వరుసగా డ్రోన్లను పంపుతూ కవ్వింపులకు దిగుతోంది. ఇదే క్రమంలో నిన్న 36 ప్రాంతాల్లో పాకిస్తాన్ పంపిన 300 నుంచి 400 టర్కీ తయారీ డ్రోన్లను కూల్చేసినట్లు వాయుసేన ఇవాళ ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వచ్చిన గంటల్లోనే మరోసారి పాకిస్తాన్ మరోసారి డ్రోన్లను భారీగా భారత్ పైకి ప్రయోగిస్తోంది.
నిన్నటి తరహాలోనే పాకిిస్తాన్ ఇవాళ కూడా జమ్మూతో పాటు సరిహద్దు రాష్ట్రాలపైనే డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఇందులో జమ్మూ, సాంబా, పంజాబ్ లోని పఠాన్ కోట్, ఫిరోజ్ పూర్, రాజస్దాన్ లోని పోఖ్రాన్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. వీటిపై నిన్నటి తరహాలోనే టర్కిష్ డ్రోన్లతో పాకిస్తాన్ దాడులకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్ కూడా అంతే దీటుగా వీటిని ఎక్కడికక్కడే కూల్చేస్తోంది. దీంతో ఎక్కడా ఎలాంటి నష్టం జరగలేదు.

పాకిస్తాన్ డ్రోన్ల దాడులతో సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. నిన్నటిలాగే ఇవాళ కూడా సరిహద్దు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ప్రజల్ని ఇళ్లలో నుంచి బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జమ్మూ, కశ్మీర్ తో పాటు జైసల్మేర్, పంజాబ్, రాజస్తాన్, అమృత్ సర్ ఇలా చాలా ప్రాంతాల్ల ో విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.
మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పలు చోట్ల పాకిస్తాన్ కాల్పుల మోత కొనసాగుతోంది. దీంతో భారత బలగాలు కూడా ప్రతిగా కాల్పులు జరుపుతున్నాయి. దీంతో సరిహద్దుల్లోనూ ఉద్రికత కొనసాగుతోంది. దీనిపై ప్రధాని మోడీకి ఎప్పటికప్పుడు త్రివిధ దళాధిపతులు సమాచారం అందిస్తున్నాయి. ప్రస్తుతం వారు ప్రధాని నివాసంలోనే ఆయనతో భేటీ అయి పరిస్ధితిని వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications