కొత్త కరోనా స్ట్రెయిన్: గగుర్పాటు కలిగించే నిజం: భారత్లోనే: పరిణామక్రమం..విస్తరణ
న్యూఢిల్లీ: ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అనే సామెత.. కరోనా వైరస్ విషయంలోనూ రుజువు అవుతోంది. ఇప్పటికే ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా కంటే.. కొత్తగా పుట్టకొచ్చిన స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరమని తేలింది. ప్రత్యేకించి- అది వ్యాప్తి చెందే క్రమం నిపుణులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ వైరస్ తొలిసారిగా వెలుగులోకి వచ్చిన బ్రిటన్ కంటే.. భారత్లోనే అది శరవేగంగా విస్తరించే ప్రమాదం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి శాస్త్రీయబద్ధమైన కారణాల కోసం నిపుణులు అన్వేషిస్తున్నారు.

అత్యంత ప్రమాదకారిగా..
కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ బ్రిటన్లో వెలుగులోకి వచ్చింది. దీన్ని B.1.1.7గా శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. అక్కడ దాని విస్తరణ అంచనాలకు మించిన స్థాయిలో ఉంటోంది. దీనికి కారణం.. అక్కడి వాతావరణ పరిస్థితులు. మానవ జన్యుక్రమం. ఈ కొత్త వేరియంట్ ప్రభావం ఇతర వైరస్లతో పోల్చుకుంటే 56 నుంచి 70 శాతం వేగంగా వృద్ధి చెందడానికి అనుకూల పరిస్థితులు బ్రిటన్లో ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుత అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం- కొత్త మ్యూటెంట్ కరోనా వైరస్ కంటే అత్యంత ప్రమాదకారిగా నిర్ధారించారు.

భారత్లో అడుగు పెట్టినట్టు..
కొత్త కరోనా వైరస్ మ్యూటెంట్.. భారత్లో ప్రవేశించినట్లు దాఖలాలు ఇప్పటిదాకా లేవు. ఇదే పరిస్థితి ఇక ముందూ కొనసాగుతుందనడానికి గ్యారంటీ లేదు. బ్రిటన్ నుంచి భారత్కు వచ్చిన వందలాది మందిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వారంతా ఐసొలేషన్లో ఉంటున్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో గడుపుతున్నారు. వారికి సోకింది.. సాధారణ కరోనా వైరస్ లేదా కొత్త వేరియంట్ అనేది నిర్ధారణ కాలేదు. వారి నుంచి సేకరించిన శాంపిళ్లను హైదరాబాద్లోని సీసీఎంబీ, పుణేలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్లకు పంపించారు. వాటి నివేదికలు ఇంకా అందాల్సి ఉంది.

విస్తరణకు భారత్లో అనుకూల పరిస్థితులు..
బ్రిటన్లో వెలుగు చూసిన ఈ కొత్త కరోనా వేరియంట్..భారత్లో అడుగు పెట్టడమంటూ జరిగితే.. అది విస్తరించే వేగాన్ని అంచనా వేయలేమని నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్లో 70 శాతం వేగంతో అది విస్తరిస్తున్నట్లు భావించినా.. భారత్లోకి వచ్చేసరికి అది మరింత వేగాన్ని అందుకునే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం- ఇక్కడి వాతావరణం.. పౌష్టికాహార లోపం అని అంచనా వేస్తున్నారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారికి కొత్త వైరస్ మ్యూటెంట్ వేగంగా సోకుతుందని నిపుణులు నిర్ధారించారు.

బ్రిటన్తో పోల్చుకుంటే..
బ్రిటన్ సహా ఇతర దేశాలతో పోల్చుకుంటే.. పౌష్టికాహార లోపంతో బాధపడేవారి సంఖ్య భారత్లోనే ఎక్కువ కావడం దీని విస్తరణకు బాటలు వేస్తుందని చెబుతున్నారు. పౌష్టికాహార లోపంతో బాధపడే వారి జన్యువులు, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల కొత్త వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, పౌష్టికాహార లోపం వంటి పరిణామాలు కొత్త స్ట్రెయిన్ శరవేగంగా వ్యాప్తి చెందడానికి దారి తీస్తాయని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications