పాకిస్తాన్ కు చుక్కలే: కేంద్రం డేగకన్ను: ఏకంగా రూ. 1,943 కోట్లతో 'మెరుపు తీగెలు' లీజ్
దేశ రక్షణ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తీరప్రాంత రక్షణ.. ప్రత్యేకించి హిందూ మహాసముద్రంపై నిఘాను మరింత బలోపేతం చేయడానికి కేంద్రం ఓ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ డిఫెన్స్ కంపెనీ జనరల్ అటామిక్స్తో రూ. 1,943 కోట్ల విలువైన డీల్ కు ఆమోదం తెలిపింది. దీని ద్వారా నౌకాదళం కోసం రెండు అత్యాధునిక ఎంక్యూ-9బీ సీ గార్డియన్ డ్రోన్లను లీజుకు తీసుకోనున్నారు.
సముద్ర తీరంలో వ్యూహాత్మక భద్రతకు ప్రాముఖ్యత పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లీజ్ కాంట్రాక్ట్ కుదరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హిందూ మహాసముద్ర పరిధిలో పెరుగుతున్న ఇతర దేశాల వ్యూహాత్మక కదలికలను గమనించడం, సరిహద్దులపై నిరంతర నిఘా ఉంచడం ఈ డ్రోన్ల ద్వారా సులభతరమౌతుంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, సెన్సార్లతో కూడిన ఈ డ్రోన్లు.. దేశ నౌకాదళ నిఘా సామర్థ్యానికి అదనపు బలాన్ని చేకూరుస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. హిందూ మహాసముద్ర రీజియన్ లో దేశ రక్షణను పటిష్టం చేయడం, చొరబాట్లను నిరోధించడానికి ఈ డ్రోన్లు సహాయపడతాయని తెలిపింది.

ఎంక్యూ-9బీ సీ గార్డియన్ డ్రోన్లకు అంతర్జాతీయంగా ఎంతో ఆదరణ ఉంది. ఆకాశంలో చాలా ఎత్తున వరకు ఎగరగలగడం, సుదీర్ఘ కాలం పాటు ప్రయాణించే సామర్థ్యం వీటి సొంతం. ఈ డ్రోన్లు నిరంతరాయంగా 30 గంటలకు పైగా గాల్లోనే ఉంటూ డేగకన్ను వేయగలవు. సముద్రమట్టానికి సుమారు 40,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఎగురుతూ సుదూర సరిహద్దు ప్రాంతాలను సైతం పరిశీలించగలవు. శత్రువుల జలాంతర్గాములను పసిగట్టే అత్యాధునిక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ మిషన్ కిట్ను కూడా వీటికి జత చేసే వెసలుబాటు ఉంది.
ప్రస్తుతం కుదుర్చుకున్న ఈ లీజ్ ఒప్పందం.. భవిష్యత్తులో కేంద్రం కొనుగోలు చేయబోయే భారీ డ్రోన్ల డీల్తో సంబంధం లేకుండా స్వతంత్రంగా సాగుతుంది. మెరికా ప్రభుత్వం నుంచి సుమారు మూడు బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో మొత్తం 31 ఎంక్యూ-9బీ డ్రోన్లను కొనుగోలు చేయాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించిన నేపథ్యంలో.. ఈ దిశగా ఓ ముందడుగు పడినట్టయింది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకునేలోపు ఎదురయ్యే తక్షణ రక్షణ అవసరాలను తీర్చడానికి రక్షణ శాఖ ఈ రెండు అధునాతన డ్రోన్లను లీజు పద్ధతిలో అత్యవసరంగా సేకరిస్తోంది.
భవిష్యత్తులో కొనుగోలు చేయబోయే 31 డ్రోన్ల భారీ ఒప్పందంలో భాగంగా నౌకాదళానికి 15 సీ గార్డియన్లు అందుతాయి. అలాగే ఆర్మీ, వైమానిక దళాలకు చెరి ఎనిమిది చొప్పున ల్యాండ్ అటాక్ సామర్థ్యం గల స్కై గార్డియన్ డ్రోన్లను కేటాయిస్తారు. సముద్ర సరిహద్దుల్లో నిత్యం ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు భారత రక్షణ వ్యవస్థకు ఈ డ్రోన్లు మరింత బలాన్ని ఇస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.












Click it and Unblock the Notifications