దేశంలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 11వేల కొత్త కేసులు, 300కు దిగువనే మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11వేల కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 300కు దిగువనే నమోదైంది. రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ మేరకు వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో 12,55,904 నమూనాలను పరీక్షించగా.. 11,271 కొత్త కేసులు వెలుగుచూశాయి. కాగా, ఒక్క కేరళ రాష్ట్రంలోనే 6వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇక శనివారం ఒక్క రోజే కరోనా బారినపడి 285 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 4,63,530కి చేరింది.
మరోవైపు శనివారం 11,376 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.38 కోట్లకు పెరిగింది. రికవరీ రేటు 98.26కి పెరిగింది. మార్చి 2020 తర్వాత రికవరీ రేటు ఇదే అత్యధికం కావడం గమనార్హం.

దేశంలో రికవరీలు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో 1,35,918 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.39 శాతానికి తగ్గింది. ఇది 17 నెలల కనిష్టానికి చేరడం శుభ పరిణామమే.
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 57,43,840 మంది టీకాలు వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 112 కోట్లు దాటింది. అయితే, పలు ప్రాంతాల్లో వెలుగు చూస్తున్న డెంగ్యూ, డయేరియా లాంటి వ్యాధులు కలవరపెడుతున్నాయి.












Click it and Unblock the Notifications