డిసెంబర్ 31 నాటికి పెద్దల వ్యాక్సినేషన్ పూర్తి కష్టమే- అందరికీ వ్యాక్సిన్లు మాత్రం అందుబాటులోకి
భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. వైరస్ వ్యాప్తి నెమ్మదించడంతో వ్యాక్సిన్లకు డిమాండ్ ఆ మేరకు తగ్గిపోయింది. ఇప్పటికే తయారు చేసిన వ్యాక్సిన్లను కేంద్రం రాష్ట్రాలకు పంపినా అవి ఇప్పటివరకూ పూర్తి స్దాయిలో వినియోగించలేదు. అలాగే ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చిన వ్యాక్సిన్లు సైతం వాడే పరిస్ధితి లేదు. దీంతో బూస్టర్ డోస్ వాదన తెరపైకి వస్తోంది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రాష్ట్రాలకు కేంద్రం పంపిన వ్యాక్సిన్లలో ఇంకా 15 లక్షలకు పైగా డోసులు వృథా అయిపోయే పరిస్ధితి ఉంది. మరోవైపు ఇప్పటికీ దేశంలోని వయోజనులకు రెండు డోసుల వ్యాక్సిన్ ను ఈ ఏడాది డిసెంబర్ 31 కల్లా పూర్తిగా వేయాలన్న లక్ష్యం కూడా నెరవేరేలా కనిపించడం లేదు. దీంతో కేంద్రం .. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు ఆస్పత్రులకు సైతం ఈ వ్యాక్సిన్లు త్వరగా వాడాలని ఒత్తిడి పెంచుతోంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 74 శాతం మంది వయోజనులు వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకోగా... ఇందులో 35 కోట్ల మంది రెండో డోస్ కూడా వేయించుకున్నారు. దీంతో మొత్తం వ్యాక్సిన్ వేయించుకున్న వయోజనులు 109 కోట్లకు చేరారు. మిగిలిన వయోజనులకు అఁదరికీ వ్యాక్సిన్ వేయాలంటే మొత్తం 188 లక్షల డోసుల వ్యాక్సిన్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు.
Recommended Video
ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ల కొరత లేదని, కానీ వ్యాక్సిన్లు వేయించుకునే వారే లేరని కేంద్రం చెబుతోంది. దీంతో విదేశాలకు కూడా భారీగా ఎగుమతులు పెంచుతున్నారు. అలాగే డిసెంబర్ 31 నాటికి దేశ జనాభాకు సరిపడా వ్యాక్సిన్లను అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. అదే సమయంలో ఇంటింటికీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రాలకు ఇచ్చిన దాదాపు 15 కోట్ల వ్యాక్సిన్లతో పాటు ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చిన 5 కోట్ల వ్యాక్సిన్లు వృథా అయ్యేలా ఉన్నాయి. దీంతో వీటిని ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి బూస్టర్ డోస్ గా ఇచ్చే విషయాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తోంది.