దేశంలో 70 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు: భారీగా కొత్త కేసులు, రికవరీ కూడా
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా ప్రతి రోజు 60 వేలకు పైగానే కరోనా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. అదే స్థాయిలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఉండటం గమనార్హం. దీంతో మొత్తం కరోనా కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ.. యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం అంతగా పెరగడం లేదు.
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 74,383 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 70 లక్షలు దాటింది. ఒక్క రోజు వ్యవధిలో 918 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 70,53,807కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,08,334కు చేరింది.
ప్రస్తుతం దేశంలో 8,67,496 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 60,77,977 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది. కాగా, శనివారంనాడు కొత్తగా 73,272 కరోనా కేసులు నమోదు కాగా, 926 మరణాలు సంభవించాయి.

ఆగస్టు 7న భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలకు చేరుకోగా, ఆగస్టు 23 నాటికే 30 లక్షలకు చేరుకుంది. ఇక సెప్టెంబర్ 5 నాటికి 40 లక్షలకు కరోనా కేసులు చేరాయి. సెప్టెంబర్ 16 నాటికి 50 లక్షల కేసులు దాటగా, సెప్టెంబర్ 28 నాటికే 60 లక్షలు దాటాయి.
Recommended Video
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకారం.. అక్టోబర్ 9 నాటికి 8,57,98,698 నమూనాలను పరీక్షించారు. ఒక్క శుక్రవారం రోజునే 11,64,018 నమూనాలను పరీక్షించారు.












Click it and Unblock the Notifications