మోదీ రూపంలో బతికే ఉన్న బిన్ లాడెన్: పీక్స్లో భారత్-పాక్ మధ్య మాటల యుద్ధం
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థిితులు నెలకొన్నాయి. ప్రస్తుతం చైనాతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటోన్న పరిస్థితుల్లో తాజాగా- పాకిస్తాన్ సైతం భారత్పై మాటల తూటాలను సంధిస్తోంది. దీనిపై భారత్ ఎదురుదాడికి దిగింది..ధీటుగా బదులిస్తోంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య నామమాత్రంగా ఉన్న దౌత్య సంబంధాలను మరింత బలహీనపర్చినట్టయింది.
పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఘాటుగా విమర్శలను సంధించడం దీనికి కారణమైంది. అమెరికన్ సైనికుల ఎదురుకాల్పుల్లో హతమైన అంతర్జాతీయ ఉగ్రవాది, అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్తో ప్రధాని మోదీని పరోక్షంగా పోల్చారు. ఒసామా బిన్ లాడెన్ చనిపోయినప్పటికీ.. గుజరాత్లో ఆ కసాయి ఇంకా బతికే ఉన్నాడని, అతను భారత ప్రధానిగా పని చేస్తోన్నారని బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు.
అక్కడితో ఆగలేదాయన. మోదీ ప్రధాని అయ్యే వరకు తమ దేశంలోకి రాకుండా అమెరికా నిషేధించిందని గుర్తు చేశారు. ప్రధానిగా ఎన్నికైన తరువాతే ఆయన ప్రవేశం లభించిందని పేర్కొన్నారు. మోదీ భారత్కు ప్రాతినిథ్యాన్ని వహించట్లేదని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తోన్నట్లు కనిపిస్తోందని బిలావల్ భుట్టో అన్నారు. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కూడా ఆర్ఎస్ఎస్కే పని చేస్తోన్నారని వ్యాఖ్యానించారు.
తన దృష్టిలో అంటే- హిట్లర్తో సమానమని పేర్కొన్నారు. హిట్లర్ ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ స్ఫూర్తి పొందుతోందని బిలావల్ భుట్టో అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల భారత్ మండిపడింది. తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్ అత్యంత హీన స్థాయికి దిగజారినట్టయిందని తెలిపింది. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్.. తమ దేశ ప్రధానమంత్రిని తప్పు పట్టడం దారుణమని పేర్కొంది.
ఉగ్రవాదానికి ఏ దేశం ఆర్థిక సహకారాన్ని అందిస్తోందనేది ప్రపంచం మొత్తానికీ తెలిసిన విషయమేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు. అటు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కూడా బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన చేసిన కామెంట్స్- ప్రధాని మోదీ ఇమేజీని ఏ మాత్రం ప్రభావితం చేయలేవని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ తన బుద్ధి ఏమిటనేది మరోసారి బయటపెట్టుకుందని విమర్శించారు.