పాకిస్థాన్కు బిగ్ షాక్.. అగ్ని-1, పృథ్వీ-2 బాలిస్టిక్ క్షిపణుల పరీక్ష విజయవంతం
Ballistic Missiles: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 'ఆపరేషన్ సింధూర్' ను ప్రారంభించి పాకిస్తాన్తో పాటు చైనాకు కూడా గట్టి హెచ్చరిక ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారిని, మద్దతు ఇచ్చేవారిని ఇకపై సహించేది లేదని భారత్ స్పష్టం చేసింది. భారత్ పాకిస్తాన్లోని 11 సైనిక విమాన స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడంతో, ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశం వెంటనే శాంతి రాగాన్ని అందుకుంది. భారత్ శాంతి ప్రతిపాదనను అంగీకరించింది. అయితే 'ఆపరేషన్ సింధూర్' విరామం మాత్రమేనని..ముగియలేదని స్పష్టం చేసింది. గత రెండు రోజులలో భారత్ తీసుకున్న బలమైన వ్యూహాత్మక చర్యలు 'ఆపరేషన్ సింధూర్' ఇంకా కొనసాగుతోందని ధ్రువీకరించాయి.
భారత్ ఒక్కరోజే మూడు కీలక క్షిపణులు పృథ్వీ-2, అగ్ని-1, ఆకాశ్ ప్రైమ్లను సక్సెస్ఫుల్గా పరీక్షించింది. భారత్ గురువారం స్వల్ప-శ్రేణి అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణులు పృథ్వీ-2, అగ్ని-1లను వరుసగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి స్ట్రాటెజిక్ ఫోర్సెస్ కమాండ్(SFC) ద్వారా పృథ్వీ-2 (350-కి.మీ. స్ట్రైక్ రేంజ్), అగ్ని-1 (700-కి.మీ.) క్షిపణులను ప్రయోగించారు. "ఈ ప్రయోగాలు అన్ని కార్యాచరణ, సాంకేతిక పారామితులను ధృవీకరించాయి" అని రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం రాత్రి ఒక సంక్షిప్త ప్రకటనలో తెలిపింది. అయితే, ఒకే రోజున రెండు అణు సామర్థ్యం గల క్షిపణులను పరీక్షించడం బహుశా ఇదే మొదటిసారి.

ఎల్ఏసీకి చేరువగా ఆకాశ్ ప్రైమ్ క్షిపణి పరీక్ష
భారత్ ఒకవైపు హిమాలయాల ఎత్తులలో లడఖ్ (LAC - చైనా సరిహద్దు) లో ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అప్గ్రేడెడ్ వెర్షన్ "ఆకాశ్ ప్రైమ్"ను బుధవారం పరీక్షించారు.ఆకాశ్ ప్రైమ్ డిఫెన్స్ సిస్టమ్ను భారత సైన్యం కోసం అభివృద్ధి చేశారు. లడఖ్లో ఈ క్షిపణిని పరీక్షించడం ముఖ్యమైనది, ఎందుకంటే ఇది వాస్తవ నియంత్రణ రేఖ (LAC)కి సమీపంలో ఉంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ప్రకటనలో.. "భారత్ జూలై 16న భారత సైన్యం కోసం ఆకాశ్ ఆయుధ వ్యవస్థ అప్గ్రేడెడ్ వెర్షన్ ఆకాశ్ ప్రైమ్ ద్వారా లడఖ్లో అధిక ఎత్తులో ఉన్న మానవరహిత లక్ష్యాలను విజయవంతంగా నాశనం చేయడం ద్వారా ఒక ముఖ్యమైన విజయాన్ని సాధించింది" అని పేర్కొంది. ఈ ఆయుధ వ్యవస్థ 4,500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో పనిచేయగలదని, దేశీయంగా అభివృద్ధి చేయబడిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ను కూడా కలిగి ఉందని అందులో పేర్కొన్నారు. మారిన వ్యూహాత్మక పరిస్థితులలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండటం చాలా అవసరం, తద్వారా శత్రువుల దాడులను గాలిలోనే నిరోధించవచ్చు. ఆకాశ్ ప్రైమ్ సిస్టమ్ ఆ దిశగా ఒక పెద్ద ముందడుగు.ఈ విధంగా భారత్ ఒకేసారి పాకిస్తాన్కు, దాని మిత్రుడు చైనాకు గట్టి సందేశం పంపింది.












Click it and Unblock the Notifications