నాలుగో టీ20 మ్యాచ్ చీకట్లో జరుగుతుందా?
భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ శుక్రవారం జరగనున్న సంగతి తెలిసిందే. రాయ్ పూర్ లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో రాత్రి 7.00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న వేళ మైదానంలో కొన్నిచోట్ల విద్యుత్తు వెలుగులు ఉండకపోవచ్చంటున్నారు. ఈ స్టేడియంను కొంతకాలం నుంచి కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో మైదానికి కరెంట్ సరఫరా అవడంలేదు. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్ ను జనరేటర్లతో నడిపించనున్నారు.
ఈ స్టేడియంను నిర్మించిన తర్వాత దీని నిర్వహణను ప్రజా పనులశాఖ కు అప్పగించారు. ఇతర ఖర్చులను క్రీడాశాఖ భరిస్తోంది. అయితే 2009 నుంచి ఈ స్టేడియం విద్యుత్తు బిల్లులు చెల్లించడంలేదు. ఆ బకాయిలు పెరిగి పెరిగి రూ.3.16 కోట్లకు చేరాయి. వీటిగురించి పీడబ్ల్యూడీ, క్రీడాశాఖకు పలు సార్లు నోటీసులు పంపినా ఎటువంటి స్పందన రాలేదని విద్యుత్తుశాఖ అధికారులు తెలిపారు.

దీంతో చేసేదేం లేక 2018లో ఈ మైదానానికి విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. ఆ సమయంలో ఇక్కడ హాఫ్ మారథాన్ జరిగింది. మైదానంలో కరెంట్ లేకపోవడంతో ఇందులో పాల్గొన్న అథ్లెట్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత చత్తీస్ గడ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు స్టేడియంలో తాత్కాలిక కనెక్షన్ ఏర్పాటు చేశారు. అయితే ఆ విద్యుత్తు కేవలం స్టేడియంలోని గదులు, వీక్షకుల గ్యాలరీ, బాక్సుల్లో లైట్లకు మాత్రమే సరిపోతుంది. దీంతో మైదానంలో ఫ్లడ్ లైట్ల కోసం ప్రత్యేకంగా జనరేటర్లను వినియోగించాల్సి ఉంది. గతంలో కూడా ఇలాగే చేశారు.
2018 తర్వాత నుంచి మొత్తం ఇక్కడ మూడు మ్యాచ్ లు జరిగాయి. అన్నిసార్లు తాత్కాలిక కనెక్షన్, జనరేటర్లతోనే నడిపించారు. తాజా మ్యాచ్ కు తాత్కాలిక కనెక్షన్ సామర్థ్యాన్ని పెంచాలని క్రికెట్ అసోసియేషన్ సంబంధిత అధికారులను కోరింది. అందుకు అనుమతులు లభించినా ఎలాంటి పనులు చేపట్టలేదు. భారత్, ఆసీస్ మ్యాచ్ కూ జనరేటర్లతోనే ఫ్లడ్ లైట్లను వెలిగించనున్నట్లు అసోసియేషన్ తెలిపింది.












Click it and Unblock the Notifications