ప్రపంచంలోనే రోజువారీ కరోనా కేసుల వరుస రికార్డులతో భారత్ .. తాజాగా 3,86,452 కొత్త కేసులు
భారత దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాలు భారత దేశానికి ఎవరూ వెళ్లొద్దని, ఒకవేళ అక్కడ ఎవరైనా తమ దేశ ప్రజలు ఉంటే తక్షణం తిరిగి వచ్చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అంతేకాదు భారతదేశానికి విమానయాన సర్వీసులను సైతం రద్దు చేస్తున్నాయి. ఒకప్పుడు అమెరికాలో ఉన్న కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో నెలకొన్న పరిస్థితి, ప్రస్తుతం భారతదేశంలో కనిపిస్తుంది.

గత తొమ్మిది రోజులుగా 3 లక్షలకు పైగా కొత్త కేసులు , గత 24 గంటల్లో 3,86,452 కేసులు
మూడు లక్షలకు పైగా కొత్త కేసులను గత తొమ్మిది రోజులుగా నమోదు చేస్తున్న భారతదేశం ఈరోజు మరోమారు తన రికార్డును తానే బద్దలు చేస్తూ అత్యధిక రోజువారీ కేసులను నమోదు చేసింది.తాజాగా ఇండియాలో 24 గంటల్లో కరోనామహమ్మారి కారణంగా 3,86,452 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనాకేసుల సంఖ్య 1,87,62,976 కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,498 మంది రోగులు కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందారు.దీంతో దేశంలో మరణాల సంఖ్య 208,330 కు చేరుకుంది.

క్రియాశీల కేసుల సంఖ్య 31,70,228
ప్రస్తుతం భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసులు మూడు మిలియన్లను దాటాయి. గత 24 గంటల్లో క్రియాశీల కేసుల సంఖ్య 85,414 పెరిగి దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 31,70,228 వద్దకు చేరుకుంది.దేశంలో మొత్తం ధృవీకరించబడిన కేసులలో ఇది 16.90 శాతం. గత 24 గంటల్లో 2,97,540 మంది రోగులు కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు .ఇప్పటివరకు 1,53,84,418 మంది కరోనా నుండి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డాష్బోర్డ్ చూపించింది. దీనితో, దేశం యొక్క రికవరీ రేటు 81.99 శాతంగా ఉందని తెలుస్తుంది.

జూలై-ఆగస్టు నాటికి మహారాష్ట్రలో కరోనా థర్డ్ వేవ్
కోవిడ్ -19 కోసం ఏప్రిల్ 29 న 19,20,107 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) శుక్రవారం తెలిపింది. దేశంలోని వైద్య సిబ్బంది కరోనాకు సంబంధించి ఇప్పటివరకు 28,63,92,086 నమూనాలను పరీక్షించారని ఐసిఎంఆర్ వెల్లడించింది. ఇదిలా ఉంటే మూడవ కోవిడ్ వేవ్ జూలై-ఆగస్టు నాటికి మహారాష్ట్రను తాకవచ్చని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు.
Recommended Video

మహారాష్ట్ర , ఢిల్లీలలో పరిస్థితి దారుణం .. తెలుగు రాష్ట్రాల్లోనూ పెరుగుతున్న కేసులు
కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో పరిస్థితి ఇంకా కంట్రోల్లోకి రాలేదు. కరోనా కారణంగా మహారాష్ట్రలో ఇప్పటివరకూ 45 ,39,553 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 66 ,159 కేసులు నమోదైనట్లు గా తెలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో 771 మంది మరణించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మహారాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది.ఇక ఢిల్లీలో సైతం పరిస్థితి దారుణంగా ఉంది. మరోపక్క తెలుగు రాష్ట్రాల్లోనూ రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications