పాకిస్థాన్కు మరో భారీ షాకిచ్చిన మోడీ సర్కారు
జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. 26 మంది భారతీయుల ప్రాణాలు బలిగొన్న ఈ ఉగ్రదాడిలో పాక్ ప్రమేయం ఉండటంతో ఆ దేశంపై అన్ని రకాలుగా కఠిన చర్యలకు దిగింది భారత్. తాజాగా, పాకిస్థాన్కు మరో భారీ షాకిచ్చింది మోడీ సర్కారు.
పాకిస్థాన్ గగన తలంపై మనదేశ విమానాల రాకపోకలపై ఆ దేశం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ కూడా ధీటుగా స్పందించింది. పాక్ విమానయాన సంస్థలకు మన దేశ గగన తలాన్ని (Indian airspace) మూసివేసింది. ఇందుకు సంబంధించిన నోటమ్ (NOTAM) ను తాజాగా బుధవారం జారీ చేసింది. ఈ నిర్ణయంం ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు అమలులో ఉండనుంది.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఏ క్షణమైనా భారత్ తమ దేశంపై దాడి చేసే అవకాశం ఉండొచ్చనే భావనతో ఇటీవల పాక్ మన విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ కూడా పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేత, అటారీ-వాఘా సరిహద్దు మూసివేతతోపాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ వదిలి వెళ్లాలని ఆదేశించింది.
తాజాగా, పాక్ దేశ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా అధికారికంగా నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్థాన్ కు సంబంధించిన కమర్షియల్, లీజుకు తీసుకున్న, సైనిక విమానాలు భారత గగన తలాన్నిఉపయోగించుకోలేవు. ఈ నిర్ణయంతో పాక్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయ్లాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా, శ్రీలంక గుండా దూర ప్రయాణం చేయాల్సిందే. దీంతో పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ సంస్థల విమానాలు ఎక్కువ దూరంగా ప్రయాణించడంతోటు ఎక్కువ సమయం తీసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications