చైనీస్ యాప్స్కు భారత్ దెబ్బ... దేశీ యాప్స్కు బిగ్ బూస్ట్... ఇంట్రెస్టింగ్ డేటా...
గతేడాది జూన్లో భారత్-చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. చైనా చేసిన ఈ దాడికి ప్రతీకారంగా ఆ దేశానికి చెందిన 59 యాప్స్పై భారత్ నిషేధం విధించింది. ఇందులో పాపులర్ సోషల్ యాప్ టిక్టాక్ కూడా ఒకటి. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలో చైనీస్ యాప్ మార్కెట్ గణనీయంగా పడిపోయింది. అదే సమయంలో దేశీ సోషల్ యాప్స్ పుంజుకున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఆసక్తికర డేటా వెల్లడైంది.
29శాతం పడిపోయిన చైనీస్ యాప్స్
భారత్లో 2020లో చైనీస్ యాప్స్ను ఇన్స్టాల్ చేసుకోవడం 29శాతం మేర పడిపోయినట్లు యాప్స్ ఫ్లయర్ అనలిటిక్స్ వెల్లడించింది. అదే సమయంలో దేశీ యాప్స్ ఇన్స్టాల్స్ 39శాతం మేర పెరిగినట్లు తెలిపింది. చైనీస్ యాప్స్పై నిషేధం,స్వచ్చందంగా చాలామంది భారతీయులు వాటిని తొలగించడంతో యాప్ మార్కెట్లో స్పేస్ క్రియేట్ అయింది. భారత్కు చెందిన యాప్స్తో పాటు ఇజ్రాయెల్,అమెరికా,జర్మనీ,రష్యాలకు చెందిన యాప్ కంపెనీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాయి.
సెమీ అర్బన్ ప్రాంతాల్లో పెరిగిన వినియోగం
దేశంలోని సెమీ అర్బన్ ప్రాంతాల నుంచి కూడా యాప్స్ వినియోగానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో యాప్ కంపెనీలు టైర్-2,టైర్-3 పట్టణాలకు కూడా తమ సేవలను విస్తరిస్తున్నాయి. అత్యంత వైవిధ్యమైన,విభిన్నమైన ఈ మార్కెట్లో కస్టమర్లను నిలుపుకోవాలంటే ఆయా కంపెనీలు ప్రత్యేక కంటెంట్ కలిగి ఉండాలి.' అని యాప్ ఫ్లయర్ ఇండియా మేనేజర్ సంజయ్ త్రిశాల్ తెలిపారు.
85శాతం అక్కడే...
దేశంలోని సెమీ అర్బన్ ప్రాంతాల్లో మొబైల్,ఇంటర్నెట్ వినియోగం పెరిగిందన్నారు. టైర్-2,టైర్-3 పట్టణాలు,నగరాల్లోనే దాదాపు 85శాతం యాప్స్ ఇన్స్టాల్ అవుతున్నాయన్నారు. గేమింగ్,ఫైనాన్స్,ఎంటర్టైన్మెంట్కి చెందిన యాప్స్ ఇందులో టాప్లో ఉన్నట్లు తెలిపారు. కరోనా లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువమంది ఇళ్ల వద్దే ఉంటుండటంతో యాప్స్ వినియోగం పెరిగింది. అదే సమయంలో యాప్స్ అన్ఇన్స్టాల్ రేటు కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది. సగటున ఒక యాప్ నిలుపుదల రేటు ఈ ఏడాది ప్రారంభంలో 22.3శాతం ఉండగా... 30 రోజులు గడిచేసరికి అది 12శాతానికి పడిపోయింది.