లక్ష వ్యాక్సిన్స్ గిప్ట్: నేపాల్ ఆర్మీకి భారత్ బహుమతి.. చైనా కూడా..
కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇటు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా కొనసాగుతోంది. కొన్ని దేశాలు వ్యాక్సిన్ ఆవిష్కరించగా.. మిగతా దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. దీంతో ఆయా దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయి. అలానే భారత్ కూడా నేపాల్కు కరోనా వ్యాక్సిన్లు అందజేసి ఉదారతను చాటుకుంది. నేపాల్ ఆర్మీకి లక్ష డోసుల టీకాలను బహుమతిగా అందజేసింది.
త్రిభువన్ ఇటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద భారత ఆర్మీ.. నేపాల్ ఆర్మీకి వ్యాక్సిన్లను అందజేసింది. ఈ మేరకు ఖాట్మండులో గల భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ఇదివరకు నేపాల్కు 10 లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్ ఇచ్చి సంగతి తెలిసిందే. ఇవీ నేపాల్ ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం వినియోగించారు. మరోవైపు సోమవారం చైనా కూడా 8 లక్షల డోసుల వ్యాక్సిన్లను నేపాల్కు అందజేసింది.
వాస్తవానికి 8 లక్షల డోసుల వ్యాక్సిన్ ఒకేసారి ఇవ్వబోమని చైనా తొలుత చెప్పింది. 5 లక్షలు ఒకసారి, 3 లక్షలు ఒకసారి అని పేర్కొన్నది. కానీ సోమవారం మాత్రం ఒకేసారి వ్యాక్సిన్లను అందేసింది. వ్యాక్సిన్ను సినఫార్మ్ డెవలప్ చేసిన సంగతి తెలిసిందే. చైనా వ్యాక్సిన్ను అత్యవసర సమయాల్లో ఫిబ్రవరి 17వ తేదీ నుంచి నేపాల్ ఉపయోగిస్తోంది.