కేంద్రం మరో వివాదాస్పద నిర్ణయం-పాక్, ఆప్ఘన్, బంగ్లా హిందువులకు పౌరసత్వం-గుజరాత్ లో అమలు
భారతీయ పౌరసత్వం విషయంలో సీఏఏ రేపిన వివాదాలు అంతా ఇంతా కాదు. దీనిపై దేశంలో వెల్లువెత్తిన ఆగ్రహావేశాలతో అసోం తర్వాత మరో రాష్ట్రంలో సీఏఏ అమలుకు కేంద్రం ముందుకు రాలేని పరిస్దితి. ఇప్పుడు తాజాగా కేంద్రం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. భారతీయులు కాకపోయినా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్న హిందువులకు దేశ పౌరసత్వం కల్పించేలా ఆదేశాలు జారీ చేసింది. దీన్ని మోడీ, అమిత్ షా సొంతగడ్డ, అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న గుజరాత్ తోనే మొదలుపెడుతోంది.
విదేశీయులకు భారత పౌరసత్వం
భారత్ లో ఏక పౌరసత్వ నిబంధన మాత్రమే అమల్లో ఉంది. అంటే ఓసారి భారత్ లో పౌరసత్వం కలిగి ఉంటే మరో దేశ పౌరసత్వం కలిగి ఉండేందుకు వీల్లేదు. అలాగే విదేశీయులకు భారత పౌరసత్వం జారీలోనూ సవాలక్ష నిబంధనలు ఉన్నాయి. వీటిని అత్యవసర పరిస్ధితుల్లో మాత్రమే సవరించి అరుదుగా అనుమతులు ఇస్తుంటారు. కానీ ఇప్పుడు కేంద్రం మాత్రం విదేశీయులకు అప్పనంగా భారత పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధమైపోతోంది. విదేశాల్లో మైనార్టీలుగా ఉన్న హిందువులకు భారత పౌరసత్వం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేస్తోంది.
పాక్, బంగ్లా, ఆప్ఘన్ హిందువులకు పౌరసత్వం
భారత ఉపఖండంలోని పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ లో వేల మంది హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. వారికి ఇప్పుడు భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆయా దేశాల్లో మైనార్టీలుగా ఉంటున్న వారు భారత్ కు తిరిగి రావాలనుకుంటే వారికి ఇక్కడి పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేస్తోంది. దీంతో ఆయా దేశాల్లో మైనార్టీలుగా ఉన్న హిందువులు భారీ ఎత్తున భారత్ కు తరలివస్తారని కేంద్రం అంచనా వేస్తోంది. బీజేపీ చేస్తున్న హిందూత్వ రాజకీయాల నేపథ్యంలో ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
గుజరాత్ నుంచే మొదలు
ఇలా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి భారత్ కు వలసవచ్చిన వారికి దేశ పౌరసత్వం కల్పించే ప్రక్రియను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాల స్వరాష్ట్రం గుజరాత్ నుంచే మొదలుపెడుతోంది. ఈ విధంగా ఈ మూడు దేశాల నుంచి తరలివచ్చి గుజరాత్ లోని ఆనంద్, మొహసానా జిల్లాల్లో నివసిస్తున్న మైనార్టీ హిందువులకు భారత పౌరసత్వం కల్పించే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెడుతూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న గుజరాత్ లో కేంద్రం ఈ నిర్ణయం ద్వారా భారీ ఎత్తున వలసవాదుల ఓట్లను బీజేపీ కొల్లగొట్టేలా ఈ నిర్ణయం తీసుకుందన్న విమర్శలు మొదలయ్యాయి.
సీఏఏకు బదులు 1955 చట్టం ద్వారా అమలు !
కేంద్రం గతంలో తీసుకొచ్చిన సీఏఏ ను అసోంలో అమలు చేసిన సందర్భంగా తలెత్తిన పరిస్ధితుల్ని అక్కడి ప్రజలు మర్చిపోలేదు. అలాగే మిగతా రాష్ట్రాల్లోనూ ప్రజలు దీన్ని వ్యతిరేకించారు. దీంతో కేంద్రం సీఏఏ ఆధారంగా ముందడుగు వేయలేని పరిస్దితి. సుప్రీంకోర్టులోనూ దీనిపై తుది తీర్పు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారమే గుజరాత్ లోని కలెక్టర్లకు పౌరసత్వం ఇచ్చే అధికారాలు కల్పిస్తున్నట్లు కేంద్రం తమ నోటిఫికేషన్ లో పేర్కొంది. గుజరాత్ లో దీన్ని అమలు చేశాక ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే ప్రక్రియ అమలు చేసేందుకు కేంద్రం సిద్దమవుతోంది.