పాకిస్థాన్ తో చర్చలు..! తేల్చి పడేసిన భారత్
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 22 న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అందుకు ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. వందలాది మంది టెర్రరిస్టులను హతమార్చింది.
అలాగే పాకిస్థాన్ పై వాణిజ్యం పరంగా కఠిన చర్యలు తీసుకుంది. అలాగే సింధూ నదీ జలాల పంపిణీని సైతం నిలిపి వేసింది. ఈ క్రమంలో ఇటీవల పాకిస్థాన్- భారత్ మధ్య అనధికారిక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ చర్చలకు రిటైర్డ్ డిప్లోమాట్స్, మిలిటరీ అధికారులు పాల్గొంటున్నారు. అయితే ఈ చర్చలపై భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చర్చలకు కొన్ని ప్రైవేట్ సంస్థలు ప్రాతినిధ్యం వహించాయని ఇందులో పాల్గొన్నవారు వారికోసం మాత్రమే చర్చించుకున్నారని భారత ప్రభుత్వం తరఫున ఈ చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ చర్చలకు కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ప్రస్తుతం సీషెల్స్ పర్యటనలో ఉన్నారు. అక్కడినుంచే ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతవారం కొలంబోలో భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన టైర్ 2 అనధికారిక చర్చలపై క్లారిటీ ఇచ్చారు. ఈ చర్చల్లో రిటైర్డ్ మిలిటరీ అధికారులు, డిప్లోమాట్స్, రాజకీయనేతలు రీజినల్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో భాగంగా పాల్గొన్నారని అన్నారు. " ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి అనేక సమావేశాలు జరుగుతుంటాయి. అనేక సబ్జెక్ట్ లపై ఈ చర్చలు ఉంటాయి. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. ఈ కార్యక్రమాల్లో ఎలాంటి ప్రత్యేకత లేదు" అని విక్రమ్ మిస్రి స్పష్టం చేశారు.
తమకు తెలిసినంత వరకూ ఇవి ప్రైవేట్ సమావేశాలు మాత్రమేనని వీటిని కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రమే నిర్వహించాయని ఇందులో ఎలాంటి అధికారిక యంత్రాంగం పాల్గొనలేదని తెలిపారు. తాను పాకిస్థాన్ ప్రభుత్వం గురించి మాట్లాడనని స్పష్టం చేశారు విక్రమ్ మిస్రి. భారత్ విషయానికి వస్తే.. ఈ సమావేశాలకు భారత్ ఎలాంటి మద్దతు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు.

ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్లు తమ వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రమే స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఇక దేశంలోని రిటైర్డ్ మిలిటరీ అధికారులు, డిప్లోమాట్స్, రాజకీయనేతలు, సివిల్ సొసైటీ సభ్యులు సమావేశమై సమస్యలపై చర్చించడాన్ని ట్రాక్ 2 డిప్లొమసీగా పిలుస్తుంటారని నిపుణులు చెబుతున్నారు .












Click it and Unblock the Notifications