ఇస్రో మరో ప్రయోగం: జీఎస్ఎల్వీ 'జీశాట్–6ఏ' నేడే నింగిలోకి..
Recommended Video

నెల్లూరు: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నుంచి మరో ప్రయోగానికి సర్వం సిద్దమైంది. జీఎస్ఎల్వీ-ఎఫ్08 వాహకనౌక ద్వారా జీశాట్-6ఏ సమాచార ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టే ప్రయోగానికి ఇస్రో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఇందుకోసం బుధవారం మధ్యాహ్నం 1.56 గంటలకు కౌంట్ డౌన్ మొదలైంది. గురువారం సాయంత్రం 4.56 గంటలకు వాహకనౌక నింగిలోకి దూసుకెళ్తుంది. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైతే పదేళ్ల పాటు దీని సేవలు ఉపయోగించుకోవచ్చునని అంటున్నారు.

బుధవారం నాడు జీఎస్ఎల్వీ వాహకనౌకకు అవసరమైన హీలియం, నైట్రోజన్ వాయువుల్ని నింపడం పూర్తయింది. అలాగే రాకెట్లోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను అప్రమత్తం చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్రయోజనిక్ ఇంజిన్తో జీఎస్ఎల్వీని వినియోగించడం ఇది ఆరోసారి.
షార్లోని రెండో లాంచ్ప్యాడ్ నుంచి ప్రయోగించనున్న జీశాట్-6ఏ బరువు 2,140 కేజీలు కాగా, అందులో ఇంధనం బరువే 1,132 కేజీలు కావడం గమనార్హం.
జీశాట్-6ఏ సేవలు మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని చెబుతున్నారు. ఇస్రో చరిత్రలో తొలిసారిగా 6మీటర్ల వ్యాసార్థం ఉన్న యాంటెన్నాను దీనికి అమర్చినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ యాంటెన్నా ద్వారా ఒకే దశలో ఎక్కువ మేర సమాచారాన్ని రాబట్టవచ్చునని చెబుతున్నారు. జీఎస్ఎల్వీ వాహకనౌకల ద్వారా ఉపగ్రహాల్ని ప్రయోగించడం ఇది 12వ సారి.












Click it and Unblock the Notifications