మోదీ మ్యాజిక్: రైలు పట్టాలపై 5స్టార్ హోటల్ -అత్యద్భుతంగా గాంధీనగర్ రైల్వే స్టేషన్ -కొద్ది గంటల్లో
ప్రధాని నరేంద్ర మోదీ తరచూ చెప్పే 'న్యూ ఇండియా' కళ్లారా ఆవిష్కృతం అవుతున్నది. ప్రభుత్వ విధానాల దగ్గర్నుంచి భవనాల దాకా అన్నింటా మ్యాజిక్ చేసి చూపిస్తోన్న మోదీ సర్కార్.. తాజాగా మరో అత్యద్భుతాన్ని ప్రజాసేవకు సిద్ధం చేసింది. రాబోయే రోజుల్లో దేశంలోని రైల్వే స్టేషన్ల రూపురేఖలు ఎలా మారబోతున్నాయో ఓ మచ్చుతునకలా అగుపించే గాంధీనగర్ క్యాపిటల్ రైల్వేస్టేషన్ను ప్రధాని మోదీ ఇంకొద్ది గంటల్లో ప్రారంభించనున్నారు.

రైల్వే స్టేషన్ ఫొటోలు వైరల్
గుజరాత్ రాజధానిలోని గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మన దేశంలో పూర్తిస్థాయిలో పునరాభివృద్ది చేసిన మొదటి రైల్వే స్టేషన్ ఇదేనంటూ ఇండియన్ రైల్వేస్ వారు గాంధీనగర్ స్టేషన్ ఫొటోలను షేర్ చేశారు. మనం నిత్యం చూసే రైల్వే స్టేషన్లకు భిన్నంగా, ప్రపంచ స్థాయిలో, ఎయిర్ పోర్టును తపించేలా ఉన్న గాంధీనగర్ స్టేషన్ అందరినీ ఆకట్టుకుంటున్నది. దాని విశేషాలేవంటే..

భారత్లో తొలి స్టేషన్
దేశంలోనే తొలి రీవ్యాంప్డ్ రైల్వే స్టేషన్ గా గుజరాత్ క్యాపిటల్ లో పునరాభివృద్ది పనులు 2017లో ప్రారంభమయ్యాయి. ఇండియన్ రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్ కార్పొరేషన్-IRSDC ఆధ్వర్యంలో వాయువేగంతో సాగిన పనులు ఇటీవలే పూర్తయ్యాయి. ఎయిర్ పోర్టును తలపించే గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్లో థీమ్ బేస్డ్ లైటింగ్ ప్రయాణికులను ఆకట్టుకుంటుంది. అన్ని మతాల ప్రయాణికులు ప్రార్థన చేసుకోవడానికి ప్రత్యేకమైన హాల్ కూడా ఉంది.

కాన్కోర్స్, ఆర్ట్ గ్యాలరీ..
స్టేషన్ లోపలికి రావడానికి, బయటకు వెళ్లడానికి వేర్వేరు ద్వారాలున్నాయి. లిఫ్టులు, ప్రత్యేకమైన పార్కింగ్ స్పేస్ ఉన్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రైల్వే స్టేషన్లో కాన్కోర్స్ కూడా నిర్మించారు. ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పుడు దీనిని ఉపయోగించుకోవచ్చు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా టికెట్ బుకింగ్ కౌంటర్లు, లైవ్ ఎల్ఈడీ వాల్ డిస్ప్లే లాంజ్తో పాటు ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. అన్నిటికంటే ప్రధానంగా..

పట్టాలపై 5స్టార్ హోటల్
గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ లో పట్టాలపైనే నిర్మించిన 5స్టార్ హోటల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. రైల్వే స్టేషన్ పైన లగ్జరీ హోటల్ నిర్మాణం దేశంలోనే మొదటిసారి. ఈ హోటల్లో 318 గదులు ఉన్నాయి. 7,400 చదరపు మీటర్ల విస్తీర్ణంగల ఈనిర్మాణానికి రూ.790 కోట్లు ఖర్చు చేశారు. జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొనడానికి వచ్చే అతిథులకు, మహాత్మా మందిర్లో కాన్ఫరెన్సులకు వచ్చేవారికికి ఈ హోటల్ ఆతిథ్యం ఇవ్వనుంది.

మోదీ చేతుల మీదుగా..
బయటి నుంచి చూస్తే ట్రినిటీ ఫామ్లో కనిపించే గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ లో మూడు టవర్లు ఉంటాయి. మొదటి టవర్ లో 9 అంతస్తులు, రెండో, మూడో టవర్లలో 11 అంతస్తులున్నాయి. రైల్వే స్టేషన్ గానేకాదు, మొత్తం గాంధీనగర్ సిటీలోనే పొడవైన భవంతిగా దీనికి గుర్తింపు లభించింది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(జులై 16న) వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచే ప్రారంభిస్తారు. రేపే జాతికి అంకితం కాబోతున్న ఈ స్టేషన్ నిర్వహణ బాధ్యత పూర్తిగా ప్రైవేటు సంస్థలదే.












Click it and Unblock the Notifications