వీధి కుక్కలు కరిస్తే బాధ్యత ఎవరిది? సుప్రీం కోర్టు షాకింగ్ కామెంట్స్..
వీధి కుక్కల అనూహ్య స్వభావం.. వాటి కారణంగా జరిగే ప్రమాదాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. వీధి కుక్కలు ఎప్పుడు కరుస్తాయో ఊహించలేమని.. వాటి మానసిక స్థితిని అర్థం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేగాక అవి కరిచినా, కరవకున్నా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని పేర్కొంది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీలో వీధి కుక్కలను షెల్టర్ హోమ్లకు తరలించాలంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలపై దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఈ క్రమంలోనే ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని, సమస్య తీవ్రతపై కోర్టు ఈ అంశంపై పలు ప్రశ్నలు, వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. వీధుల్లో తిరిగే ఏ కుక్కైనా కరుస్తుందని అనుమానం వస్తే స్థానికులు అధికారులకు తెలియజేయాలని సూచించారు. అప్పుడు అధికారులు ఆ శునకాన్ని తీసుకెళ్లి స్టెరిలైజ్ చేసి వదిలిపెడతారని ఆయన ధర్మాసనానికి వివరించారు.
అయితే దీనిపై తీవ్రంగా స్పందించిన ధర్మాసనం.. స్టెరిలైజ్ చేశాక మనుషులను కరవకుండా వాటికి కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పడం మర్చిపోయినట్టున్నారు" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. కుక్కల స్వభావంలో ఉండే అనూహ్యతను ఈ వ్యాఖ్య హైలైట్ చేసింది.
వీధి కుక్కలు కేవలం కరవడం మాత్రమే కాదని.. వీధుల్లో అడ్డదిడ్డంగా పరుగెత్తడం వల్ల వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. ప్రమాదం జరిగాక చికిత్స తీసుకోవడం కన్నా ముందే తగిన జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరమని ధర్మాసనం అభిప్రాయపడింది.
అసలు వీధుల్లో, ముఖ్యంగా పాఠశాలలు, ఇతర విద్యా సంస్థల చుట్టుపక్కల కుక్కలు సంచరించాల్సిన అవసరం ఏంటని కోర్టు ప్రశ్నించింది. వీధి కుక్కల వల్ల రోడ్లపై ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతుందని కోర్టు హెచ్చరించింది.












Click it and Unblock the Notifications