ఇండియా-స్విస్ ఒప్పందంలో లొసుగులు: నల్లకుబేరులు జారుకునే అవకాశం!
2019సెప్టెంబర్ లో స్విస్ బ్యాంకు ఖాతాల వివరాలు భారత్ కు అందనున్నాయి. ఈలోగా.. చాలామంది నల్లకుబేరులు తమ ఖాతాలను మూసేసుకోవడమో.. లేక వేరే చోటికి మార్చేసుకోవడమో జరిగే అవకాశం లేకపోలేదు.
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో కోట్ల కొద్ది నల్లధనాన్ని దాచుకున్న నల్లకుబేరుల వివరాలు రాబట్టడం కోసం స్విస్ ప్రభుత్వంతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఒప్పందం మేరకు 2018 నాటికి స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న భారతీయుల వివరాలను అందించడానికి స్విట్జర్లాండ్ అంగీకరించింది.
ఆటోమేటిక్ ఎక్సేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్(ఏఈవోఐ) ప్రకారం ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం జరగ్గా.. ఒప్పందంలో ఉన్న లొసుగులు కొంతమంది నల్లకుబేరులకు కలిసొచ్చేలా ఉన్నాయి. ఒప్పందం ప్రకారం 2018 సెప్టెంబరు నాటికి ఉన్న ఖాతాల వివరాలను మాత్రమే స్విస్ ప్రభుత్వం భారత్ కు అందజేస్తుంది. కాగా, 2018కి ఇంకా సంవత్సరం పాటు సమయం ఉండడంతో.. ఈలోగా నల్లకుబేరులు వారి ఖాతాలను మూసివేసుకునే అవకాశం కూడా లేకపోలేదు.
2018నాటికి స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న నల్లకుబేరుల జాబితాను 2019 సెప్టెంబరులో భారత్ కు అందించనుంది స్విట్జర్లాండ్. 2018 కంటే ముందున్న నల్లకుబేరుల వివరాలను తెలుసుకోవడం గురించి ఒప్పందంలో పేర్కొనలేదు కాబట్టి.. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న వారు తమ ఖాతాలను వేరే చోటుకు మార్చుకునే అవకాశం కల్పించినట్టయింది.
ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ లిమిటెడ్ (ఓఈసీడీ) ద్వారా 101 దేశాలు ఆయా దేశాలకు చెందిన ఖాతాదారుల వివరాలు వెల్లడించడానికి వెసులుబాటు కలిగింది. అయితే ఇందులో ఉన్న వేవ్-1, వేవ్-2 కేటగిరీల నిబంధనలు నల్లకుబేరులకు చెక్ పెట్టాలన్న భారత్ ఆలోచనకు ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వేవ్-1 కేటిగిరిలో ఉన్న దేశాలకు 2017నుంచి విదేశాల్లో తమ దేశాలకు చెందిన ఖాతాదారుల వివరాలు అందుతాయి. వేవ్-2 కేటగిరిలో ఉన్న దేశాలకు ఈ సమాచారం 2018నుంచి అందుతుంది. ఈ లెక్కన భారత్ కు స్విస్ ఖాతాల సమాచారం అందేనాటికి చాలామంది బ్లాక్ మనీ ఖాతాదారులు అప్రమత్తమయ్యే అవకాశముంది.
మొత్తం మీద ఇండియా-స్విట్జర్లాండ్ ఒప్పందం నల్లకుబేరులు మెల్లిగా జారుకోవడానికి వెసులుబాటు కల్పించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఒప్పందంతో తక్కువ పన్ను విధించే దేశాలకు నల్లకుబేరులు తమ ఖాతాలను మార్పిడి చేసుకునే అవకాశం ఉందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ పబ్లిక్ పాలసీకి చెందిన లేఖా చక్రవర్తి తెలిపారు.