షీనా హత్యలో రూ.150 కోట్ల కోణం! ఇంద్రాణి గుస్సా
ముంబై: షీనా బోరా హత్య కేసును ముంబై పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక నిందితురాలు, షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఇంద్రాణి పోలీసులకు పలు కథలు చెబుతోందని తెలుస్తోంది.
నా కూతురు షీనా బతికే ఉందని, అమెరికాలో హాయిగా జీవిస్తోందని, తన భర్త పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్తో షీనా డేటింగ్ నిజమేనని, ఇఫ్పుడు అమెరికాలో మరొకరిని పెళ్లి చేసుకుందని, హాయిగా జీవిస్తోందని ఇంద్రాణి పోలీసులకు చెప్పిందని తెలుస్తోంది.
పోలీసులు ఆమెను దాదాపు అరవై గంటల పాటు ప్రశ్నించారు. ఇంద్రాణి సాధారణ ప్రశ్నలకు సరిగానే సమాధానం చెబుతూ.. షీనా బోరా గురించి అడిగితే మాత్రం కస్సుమంటోందని, కథలు చెబుతోందని తెలుస్తోంది.
నేను, షీనా 2012 ఏప్రిల్ 24న బాంద్రాలో కాఫీ తాగామని, తర్వాత కూతురును ఇంటి వద్ద వదిలేశానని, మర్నాడే షీనా అమెరికా వెళ్లిందని ఇంద్రాణి పోలీసులకు చెప్పిందని సమాచారం. తమ కుటుంబ సభ్యుల్లో ఎవరితోను సంబంధాలు షీనాకు ఇష్టం లేదని అందుకే ఫోన్ చేయడంలేదని చెప్పింది.
రూ.150 కోట్లు గురించి హత్య జరిగిందా?
మరోవైపు, ఇంద్రాణీ విషయంలో షాకింగ్ విషయం పోలీసులకు తెలిసిందని సమాచారం. రూ.150 కోట్ల విషయమై షీనాను ఇంద్రాణి హత్య చేసి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. షీనా బ్యాంకు అకౌంటులో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయి.
ఇంద్రాణీ, పీటర్ ముఖర్జీయాలు తమ సంస్థను అమ్మడం ద్వారా రూ.450 నుంచి రూ.500 పొందారు. ఇందులో సేఫ్టీ కోసం రూ.150 కోట్లను ఇంద్రాణి తన కూతురు షీనా అకౌంటులో వేసిందని సమాచారం. ఈ విషయం షీనాకు తెలిసిందని సమాచారం. ఈ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారని తెలుస్తోంది.
షీనాను చంపినట్లు ఇంద్రాణి రెండో భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ చెబుతుండగా.. తన కూతురు బతికే ఉందని ఇంద్రాణి చెప్పడం గమనార్హం. రాయగఢ్ అడవుల్లో వెలికి తీసిన ఎముకలు, అవశేషాలను ముంబై పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించిన విషయం తెలిసిందే. ఇంద్రాణి, ఆమె కుమారుడు మిఖాయిల్ రక్తం, వెంట్రుకల నమూనాలను సేకరించారు.
సూటుకేసు అమ్మిన వ్యక్తి ఎవరో తెలిసింది!
పీటర్ ముఖర్జియా నివాసంలో ఇటీవల పోలీసులు ఓ సూటుకేసును స్వాధీనం చేసుకున్నారు. మిఖాయిల్ను హత్య చేసి అందులో పెట్టేందుకు ఇంద్రాణీ దానిని కొని ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆ సూటుకేసు ఎవరు అమ్మారనే విషయమై పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. మరోవైపు, షీనా బోరా హత్య గురించి ముంబై పోలీసు కమిషనర్కు ఉప్పందించిన వ్యక్తి గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
రాయ్గఢ్ పోలీసుల వైఫల్యం
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో రాయ్గఢ్ పోలీసుల వైఫల్యం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాద మరణంగా నమోదు చేసి చేతులు దులుపుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై, పోలీసుల తీరుపై మహారాష్ట్ర డిజిపి దర్యాప్తుకు ఆదేశించారు.