ఇంద్రాణిది అత్యాశే, మాయలోపడి జైలుపాలయ్యా: పీటర్
ముంబై: తన భార్య ఇంద్రాణి అత్యాశపరురాలని ఆమె భర్త పీటర్ ముఖర్జియా చెప్పారు. తన కోర్కెలను నెరవేర్చుకోవడం కోసం సొంత పిల్లలను వదులుకుందని విరుచుకుపడ్డారు. ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్య కేసులో రెండోసారి బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్లో తొలిసారిగా భార్యకు వ్యతిరేకంగా ఆయన ఆరోపణలు చేశారు.
60 ఏళ్ల పీటర్ ముఖర్జియా షీనా బోరా హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్నారు. తన ప్రతిభా సామర్థ్యాలతో ఉన్నత స్థితికి ఎదిగి సమాజంలో పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న తాను ఇంద్రాణి మాయలో పడి చివరికి జైలుపాలయ్యానని బెయిల్ పిటిషన్లో పీటర్ వాపోయారు. ఇంద్రాణి ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు చాలా మందిని ఉపయోగించుకుందని చెప్పారు.
కాగా, ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 31న విచారణకు రానుంది. గత నెలలో పీటర్ ముఖర్జియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు.
ఇటీవల జరిగిన పరిణామాలు గమనించినట్లయితే.. తాను కళ్లు తిరిగి పడిపోతున్నానని తనకు బెయిల్ ఇవ్వాలని ఇంద్రాణి ముఖర్జియా ఇటీవలో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్ విచారణ మార్చి 31కి వాయిదా పడింది.
కాగా, 2012లో జరిగిన షీనాబోరా హత్య కేసుకు సంబంధించి షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్రాయ్లను 2015 ఆగస్టులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె నేరాన్ని అంగీకరించలేదు.
కాగా, జైలుకు తీసుకెళ్లిన తర్వాత పీటర్ ముఖర్జియా ఓసారి ఆమెను జైలులో కలిశారు. ఆ సమయంలో అతనితో ఇంద్రాణి మాట్లాడుతూ.. షీనాను తాను హత్య చేయలేదని, మైఖెలే చేశాడని తెలిపారు.
షీనా మృత దేహాన్ని కనిపించకుండా చేసేందుకు మాత్రమే సహాయపడినట్లు ఆయనతో చెప్పారని పీటర్ సోదరుడు గౌతమ్ ముఖర్జియా తెలిపారు. అనవసరంగా తన సోదరుడు పీటర్ను ఈ కేసులో ఇరికించారని, 250 ఆధారాలు ఉన్నా అందులో ఏ ఒక్కటీ పీటర్ పాత్ర ఉందని రుజువు చేయలేకపోతున్నాయని అన్నారు.
షీనా హత్యలో వారిద్దరి ప్రమేయం ఉంది: మైకేల్
తన సోదరి షీనాను హత్య చేయడంతో ఇంద్రాణీ, పీటర్ ముఖర్జీల ప్రమేయం ఉందని మైకేల్ బొరా అన్నారు. షీనా కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త పీటర్ ముఖర్జీ.. తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో పీటర్ బెయిల్ పిటిషన్పై మైఖెల్ బొరా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంద్రాణీ, పీటర్ ఈ కేసులో నిందితులేనని.. అందుకే ఇద్దరూ పరస్పరం నేరాలు మోపుకుంటున్నారని ఆయన ఆరోపించాడు. షీనా కేసులో విచారణ వేగవంతం చేయాలని ఆయన కోరాడు.