రాజీకి సిద్ధమైన ఇన్ఫోసిస్! రాజీవ్ బన్సల్ వివాదంలో.. సెటిల్మెంట్ అప్లికేషన్!
ముంబై: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సల్ వివాదంలో రాజీకి సిద్ధపడుతోంది. ఈ మేరకు ప్యాకేజీపై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ముందు సెటిల్మెంట్ అప్లికేషన్ను సమర్పించింది.
సెవెరెన్స్ పే (తెగదెంపుల కోసం జరిపే చెల్లింపులు) వివాదంలో రాజీ కుదుర్చుకోనున్నామని ప్రకటించింది. ఈ మేరకు సెబికి సెటిల్మెంట్ అప్లికేషన్ను సమర్పించినట్లు బిఎస్ఈ ఫైలింగ్లో ఇన్ఫోసిస్ తెలిపింది.
బన్సల్కు సెవెరెన్స్ పే ప్యాకేజీ విషయంలో కంపెనీ సమాచార బహిర్గత నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై సెబీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 2015లో బన్సల్ సంస్థను వీడిన సందర్భంగా రూ.17.38 కోట్లను చెల్లించేందుకు అంగీకరించి... రూ.5 కోట్లుమాత్రమే చెల్లించింది.
అయితే రాజవ్ బన్సల్ దీనిపై న్యాయ పోరాటానికి దిగారు. శేషశాయి ఆధ్వర్యంలోని అప్పటి ఇన్ఫోసిస్ బోర్డు వాగ్దానం చేసినట్టుగా మిగతా సొమ్మును చెల్లించాలనేది ఆయన డిమాండ్. దీంతో వివాదం రేగింది.
అయితే ఈ సెటిల్మెంట్ ప్యాకేజీ కోసం నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ, ఆడిట్ కమిటీ నుంచి ఇన్ఫోసిస్ బోర్డు ముందస్తు అనుమతి తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. తాజాగా ఈ వివాదాన్ని సెటిల్ చేసుకోవాలని ఇన్ఫోసిస్ భావిస్తోంది.