షాక్: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య నిందితుడి ఆత్మహత్య, జైల్లో హత్య చేశారని తండ్రి
చెన్నై: సంచలనం రేపిన ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసు నిందితుడు రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆదివారం సాయంత్రం చెన్నైలోని పుజల్ కారాగారంలో సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అతను జైలు లోపల విద్యుత్ తీగను పట్టుకున్నాడు.
అతనిని వెంటనే ప్రభుత్వ రాయపేఠ ఆసుపత్రికి తరలించారు. అతనిని పరిశీలించిన వైద్యులు రామ్ కుమార్ మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఇదిలా ఉండగా, పోలీసులు అధికారికంగా ఈ హత్యను నిర్ధారించవలసి ఉంది. రామ్ కుమార్ బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రావాల్సి ఉంది. ఇంతలోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు.

రామ్ కుమార్ తండ్రి మాట్లాడుతూ.. తన కొడుకు జైలు అధికారులు తనకు ఫోన్ చేశారని, అతనిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారని, అతను మృతి చెందినట్లుగా ఇంకా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. కాగా, రామ్ కుమార్ మృతి పైన తండ్రి, అతని లాయర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జైలు వద్ద బంధువుల ఆందోళన
రామ్ కుమార్ ఆత్మహత్య నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు జైలు వద్ద ఆందోళనకు దిగారు. ఆత్మహత్య పైన తండ్రి, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. జైల్లోనే హత్య చేశారని ఆరోపించారు. రామ్ కుమార్ ఆత్మహత్య నేపథ్యంలో జైలు సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇన్ఫోసిస్లో పని చేస్తున్న స్వాతిపై చెన్నైలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో రామ్ కుమార్ కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జూన్ 24న జరిగింది. ఈ హత్య సంచలనం సృష్టించింది. హత్య జరిగిన రెండు రోజుల అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా రామ్ కుమార్ బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు.












Click it and Unblock the Notifications