కుక్క కాటుకు చెప్పుదెబ్బ: పాక్ చర్యకు భారత్ కౌంటర్!
భారత్, పాక్ దేశాల మధ్య మరోసారి దౌత్యపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ ప్రాంగణంలోని కొన్ని నిర్మాణాలను పాకిస్థాన్ అధికారులు అన్యాయంగా ధ్వంసం చేశారు. ఇలాంటి చర్యలు చేపట్టవద్దని భారత్ ముందుగానే విజ్ఞప్తి చేసినప్పటికీ.. పాక్ దానిని పట్టించుకోలేదు. దీనికి ప్రతీకారంగా ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ బయట వీధిలో నిర్మించిన కొన్ని తాత్కాలిక నిర్మాణాలను భారత అధికారులు తొలగించారు. ఈ చర్యపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. తాము సమానమైన రీతిలోనే సమాధానం ఇచ్చామని.. ఎంత మేర నష్టం జరిగిందో అంతకు తగ్గట్టే బదులిచ్చామని ఆయన స్పష్టం చేశారు.
భారత్ కౌంటర్
పాకిస్థాన్ చర్యకు తగిన రీతిలోనే భారత్ జవాబుగా బదులిచ్చిందని రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయం బయట ఉన్న అక్రమ తాత్కాలిక నిర్మాణాలను తొలగించడం అత్యవసరమైన చర్య అంటూ ఆయన వివరించారు. ఇరు దేశాల దౌత్య కార్యాలయాల విషయంలో ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకోవడం ఇది మొదటిసారేమీ కాదు. దౌత్య నిబంధనలను ఉల్లంఘిస్తే అంతే తీవ్రంగా బదులిస్తామని భారత్ ఈ చర్య ద్వారా స్పష్టమైన సందేశాన్ని పంపింది.

#WATCH | Delhi: MEA Spokesperson Randhir Jaiswal says, "Regarding the Indian High Commission in Pakistan: certain structures there were removed, despite our request that this not be done. Once it happened, we took what could be described as a proportional action — we removed some… pic.twitter.com/lDARTEt2vB
— ANI (@ANI) August 21, 2026
యెమెన్ తీరంలో నావికా సంక్షోభం
యెమెన్ తీరంలో సముద్రపు దొంగలు(పైరేట్స్) హైజాక్ చేసిన రెండు నౌకల ఉదంతంపై కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ రెండు నౌకల్లో మొత్తం 22 మంది భారతీయ నావికులు ఉన్నారని.. ఒక నౌకలో 16 మంది, మరో నౌకలో 6 మంది భారతీయులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ 22 మంది నావికులూ క్షేమంగానే ఉన్నారని రణధీర్ జైస్వాల్ తెలిపారు. నావికుల రక్షణ, సంక్షేమం కోసం సంబంధిత అంతర్జాతీయ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు.
నావికుల రక్షణకు ముమ్మర యత్నాలు
యెమన్, సోమాలియా మధ్య ఉన్న సముద్ర ప్రాంతంలో పైరేట్ల కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయని.. ఆ ప్రాంతంలోనే ఈ సంఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ నౌకల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రతపై విదేశాంగ శాఖ పూర్తి నిఘా ఉంచింది. గతంలో కూడా ఇలాంటి సముద్రపు దొంగల బారిన పడిన భారతీయ నావికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో ప్రభుత్వం విజయవంతమైందని, ప్రస్తుతం బాధితుల కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారికంగా స్పష్టం చేశారు.
#WATCH | Delhi: MEA Spokesperson Randhir Jaiswal says, "As we have said time and again, and I would like to reiterate, the welfare and safety of our seafaring community is a matter which we take very seriously, and we attach very high priority to this subject. Having said that,… pic.twitter.com/she8KkXNQa
— ANI (@ANI) August 21, 2026














Click it and Unblock the Notifications