ఇన్ఫోసిస్ లేడీ టెక్కీ హత్య కేసులో సంచలన వాస్తవాలు, ఎద, భుజంపై !
పూణే: ఇన్ఫోసిస్ లేడీ టెక్కీ రసీలా రాజు (24) హత్య కేసులో సంచలన వాస్తవాలు వెలుగు చూశాయి. ఎవరో నా చాంబర్ కు వస్తున్నారు, మళ్లీ ఫోన్ చేస్తాను అంటూ ఆమె చెప్పిన చివరి మాటలు. నిజానికి శని, ఆదివారాల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు పని చేయాల్సిన అవసరం లేదు.
అయితే బాస్ తనను తరచూ వేధిస్తున్నాడని, బలవంతంగా అదనపు సమయం పని చేయిస్తున్నాడని ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పారు. తాను బెంగళూరుకు ట్రాన్స్ ఫర్ అడిగానని, ఫిబ్రవరి మొదటి వారంలో ట్రాన్స్ ఫర్ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని రసీలా రాజు ఆరోజు వరసకు సోదరి అయ్యే అంజలీ నందకుమార్ తో ఫోన్ లో చివరి సారి మాట్లాడారు.
ఆమె ఫోన్ చేసి మాట్లాడుతూ ఎవరో వస్తున్నారంటూ చెప్పిన కొన్ని సెకండ్లకే రసీలా రాజు మొడచుట్టూ కంప్యూటర్ కేబుల్ బిగించి ఆమెను ఎవరో హతమార్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమె మృతదేహం బయటకు తీసుకు వెళ్లారు.
రసీలా రాజు ముఖం, ఎద మీద పలుసార్లు గట్టిగా కొట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఆమె ఎడమ భుజం మీద ఎవరో కొరికిన గుర్తులు కూడా ఉన్నాయని, దాన్ని బట్టి చూస్తే అత్యాచారయత్నం జరిగినట్లు, ఆమె గట్టిగా పోరాడినట్లు తెలిసిందని బీజే మెడికల్ కాలేజ్ కు చెందిన ఫోరెన్సీక్ నిపుణుడు చెప్పారు.
ఆమెపై దాడి చెయ్యడానికి ఏదో గట్టి వస్తువును ఉపయోగించారని, దాని గాయాలే ఆమె ముఖం, ఎద మీద ఉన్నాయని ఆయన తెలిపారు. ఆమె మెడకు పవర్ కేబుల్ ఉన్న స్థితిలోనే మృతదేహం మార్చురీకి తీసుకు వచ్చారని, వైరు గట్టిగా బిగించడంతో ఆమె నోరు, ముక్కులో రక్తం కారిందని, బహుశా ఆ రక్తం నిందితుడి దుస్తుల మీద కూడా పడి ఉండొచ్చని ఆయన వివరించారు.
ఇంత ఘోరంగా హత్య జరిగినా సంఘటనా స్థలానికి పోలీసులు మాత్రం ఫోరెన్సీక్ నిపుణులను తీసుకెళ్లకుండా నేరుగా మృతదేహం తరలించడం తనను షాక్ కు గురి చేసిందని అన్నారు. ఈ కేసులో ఇన్ఫోసిస్ సెక్యూరిటీ గార్డు భాబెన్ సైకియాను పోలీసులు అరెస్టు చేశారు.
ఆమె వైపు చూసినందుకు తిట్టిందనే కోపంతోనే తాను రసీలా రాజును హత్య చేశారని సెక్యూరిటీ గార్డు పోలీసుల విచారణలో అంగీకరించాడు. అయితే కేవలం సెక్యూరిటీ గార్డు మాత్రమే కాదని, ఆమెను వేధించింది బాస్ అని రసీలా రాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తన టీమ్ మేనేజర్ తన మీద ఒత్తిపెడుతున్నాడని, లంచ్ కు అతడితో వెళ్లడానికి అంగీకరించకపోవడంతో అప్పటి నుంచి నన్ను వేధిస్తున్నాడని, ట్రాన్స్ ఫర్ ఆర్డర్లు పెండింగ్ లో పెట్టారని హత్య జరగడానికి మూడు రోజుల ముందు తనకు చెప్పిందని రసీలా రాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ట్రాన్స్ ఫర్ విషయంలో మేనేజర్ కు, ఆమెకు గొడవ జరిగిందని, అప్పుడు ఆయన నీకు తగిన గుణపాఠం చెబుతానని బెదిరించాడని రసీలా రాజు సోదరుడు లైజిన్ కుమార్ చెప్పారు. 16 రోజుల కర్మకాండ పూర్తి అయిన తరువాత తాము పూణే వెళ్లి మేనేజర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రసీలా రాజు సోదరుడు లైజిన్ కుమార్ తెలిపారు. రసీలా రాజు హత్య కేసులో అరెస్టు అయిన సెక్యూరిటీ గార్డు పోలీస్ కస్టడీని ఫిబ్రవరి 7వ తేది వరకు పొడగించారు.