షాకింగ్: ‘నిర్భయ’ను మించిన ఘోరం... అదీ పోలీస్ స్టేషన్ లో, ఏం జరిగిందంటే...
ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ ను మించిన దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. దారుణమైన విషయం ఏమిటంటే.. ఈ ఘటనలో నిందితులు సాక్షాత్తు పోలీసులే కావడం.
శ్రీనగర్: ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ ను మించిన దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. దారుణమైన విషయం ఏమిటంటే.. ఈ ఘటనలో నిందితులు సాక్షాత్తు పోలీసులే కావడం. జమ్మూలోని కనాలాల్ పోలీస్ స్టేషన్లో కొన్ని రోజుల క్రితం ఈ దారుణం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జమ్మూ కానాచక్ ప్రాంతానికి చెందిన ఓ మహిళను (25) దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కనాలాల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆమెపై నిర్భయ గ్యాంగ్ రేప్ తరహాలో తీవ్ర హింసను ప్రయోగించడంతోపాటు, లైంగికంగా కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
కస్టడీలో ఉన్నపుడు కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వేధించాడు. అయితే మే 6వ తేదీన బాధితురాలికి బెయిల్ మంజూరు అయింది. దీంతో ఆమె తనకు జరిగిన అన్యాయంపై తన న్యాయవాది సహాయంతో పోరాటానికి సిద్దపడింది.
స్టేషన్ ఎస్.హెచ్.ఒ. రాకేశ్ శర్మ వారం రోజులపాటు తనను హింసించిన తీరును బాధితురాలు మీడియాకు వివరించింది. తీవ్రమైన హింసతోపాటు, లైంగిక దాడికి పాల్పడ్డాడని, ప్రయివేట్ పార్ట్స్ లో బీర్ బాటిల్ చొప్పించేందుకు ప్రయత్నించాడని, కారంపొడిని చల్లారని ఆరోపించింది.
పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు తినడానికి ఏమీ ఇవ్వలేదని బాధితురాలు వాపోయింది. నీళ్ళు అడిగితే, మూత్రం తాగమంటూ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించింది. తనపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు, తల్లి, భర్త, పిల్లలను పోలీసులు తీవ్రంగా కొట్టినట్టు కూడా ఆ మహిళ ఆరోపించింది.
బాధితురాలి తరపు న్యాయవాది ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. నిర్భయ కేసులో మాదిరిగా సాక్షాత్తు పోలీసులే ప్రవర్తించారంటూ మండిపడ్డారు. కాపాడాల్సిన పోలీసులే బాధితురాలిని క్రూరంగా హింసించారని ఆయన ఆరోపించారు.
మరోవైపు ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయంలోని సహాయ మంత్రి జితేంద్ర సింగ్ జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వాన్ని వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ ఉదంతంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.