అచ్చు దృశ్యం సినిమా లాగే.. హత్య చేసి.. ఆపై ఏంచేశారంటే?
మహారాష్ట్రలోని పూణేలో అచ్చు దృశ్యం సినిమా తరహా ఘటన ఒకటి వెలుగుచూసింది.
పూణె: మహారాష్ట్రలోని పూణేలో అచ్చు దృశ్యం సినిమా తరహా ఘటన ఒకటి వెలుగుచూసింది. ఈ సినిమాలో తమ కూతురుని వేధించిన యువకుడిని అనుకోని పరిస్థితుల్లో తల్లి హత్య చేస్తుంది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా పోలీసు విచారణల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది.
సరిగ్గా ఇదే తరహాలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు తండ్రీకొడుకులు ఓ వడ్డీ వ్యాపారిని చంపేశారు. అయితే తప్పించుకోవడానికి ఇది సినిమా కాదు కదా!.. చివరాఖరికి పోలీసుల ఎదుట అసలు నిజం ఒప్పుకోక తప్పలేదు.
వివరాల్లోకి వెళ్తే..చిక్లీకి చెందిన ఓ వడ్డీ వ్యాపారి శ్రీరామ్ శివాజీ వాలేకర్ నుంచి సమిదుల్లా మనియార్(54), ఆయన కుమారుడు మెహబూబ్ మనియార్(26) రూ.5లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే సకాలంలో అప్పు తీర్చడంలో తండ్రికొడుకులు విఫలమయ్యారు. దీంతో శ్రీరామ్ వారిపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు.

అప్పు, వడ్డీ కలిపి మొత్తం మొత్తం రూ.8.40లక్షలు శ్రీరామ్ కు బకాయిపడ్డారు. అయితే అప్పు ఎగ్గొట్టాలన్న దుర్బుద్దితో ఏకంగా శ్రీరామ్ ను హత్య చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం పథకాన్ని కూడా రచించారు. దృశ్యం సినిమా తరహాలో ఈ తతంగం మొత్తాన్ని నడిపించాలని భావించారు.
అనుకున్నట్టే గతేడాది చిక్లీ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అదే నెల 27న మాట్లాడుకుందాం రమ్మని చెప్పి శ్రీరామ్ ను ఫ్లాట్ కు రప్పించారు. అతను ఫ్లాట్ కు వచ్చాక గొంతు కోసి హత్య చేశారు. అనంతరం శవాన్ని ఓ ప్లాస్టిక్ షీట్ లో చుట్టి ఇంట్లోనే పాతిపెట్టారు. హత్య విషయం కూడా ఇక్కడితో సమాధి అయిపోతుందని భావించారు.
అయితే ఆ మరుసటిరోజే.. అంటే సెప్టెంబర్ 28న శ్రీరామ్ కనిపించడం లేదంటూ అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీరామ్ ఫోన్ కాల్స్ డేటాతో కూపీ లాగగా.. అంతకుముందు మనియార్లతో శ్రీరామ్ గొడవపడ్డట్టు పోలీసులకు తెలిసింది.
దీంతో మనియార్ కోసం అన్వేషించగా.. అప్పటికే వారు సొంతూరికి పారిపోయినట్టుగా పోలీసులు తేల్చారు. అప్పటినుంచి వారిపై నిఘా ఉంచిన పోలీసులు గురువారం నాడు మెహబూబా చిక్లీ వచ్చాడని తెలియగానే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మెహబూబాతో నిజం కక్కించారు. మెహబూబా చెప్పిన వివరాల ఆధారంగా శ్రీరామ్ మృతదేహాన్ని వెలికితీశారు. ప్రస్తుతం సమిదుల్లాను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
కాగా, దృశ్యం సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోకి అనువదించడిన సంగతి తెలిసిందే. మెహూబూబా-మనియార్ హిందీలో వచ్చిన దృశ్యం సినిమాను చూసి ఈ హత్య చేయడానికి స్పూర్తి పొందినట్టుగా పోలీసులు నిర్దారించారు.












Click it and Unblock the Notifications