Interesting Video:ఆగ్రామంలో నాగపంచమి కాదు..తేళ్ల పంచమి చేశారు: విషపురుగులతో గేమ్స్..!!
ఆగష్టు 13వ తేదీ దేశమంతా నాగపంచమి అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంది. పాము పుట్టకు వెళ్లి పాలు పోసి చాలా భక్తితో పూజలు చేశారు. అయితే పాములు నివాసం ఉండే పుట్టల్లో లీటర్ల లీటర్ల పాలు పోసి వాటిని హింసించొద్దు అని జంతు ప్రేమికులు చెప్పినప్పటికీ.. భక్తి ముందు ఆ మాటలన్నీ బలాదూరే. సరే.. ఈ స్టోరీ కాసేపు అటుంచితే దేశమంతా నాగపంచమిని ఘనంగా జరుపుకుంటుండగా కర్నాటకలోని ఆ ఒక్క గ్రామం మాత్రం తేళ్ల పంచమిని జరుపుకుంది. ఇదేంటి వినటానికి విడ్డూరంగా ఉంది కదూ.. కానీ ఇది నిజం. ఇంతకీ ఆ గ్రామం ఏంటి.. తేళ్ల పంచమి అక్కడ ఏటా ఎందుకు నిర్వహిస్తారు.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇందులో వీడియో చూడాల్సిందే.
Recommended Video
కర్నాటక గ్రామంలో తేళ్ల పంచమి
ఆగష్టు 13వ తేదీ దేశం యావత్తు నాగపంచమి పండగను జరుపుకుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో నాగదేవతకు పూజలు చేశారు భక్తులు. దేశమంతా నాగుల పంచమి వేడుకలు చేస్తుంటే అదే రోజున కర్నాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లా కందుకూరు గ్రామంలో మాత్రం తేళ్ల పంచమి జరుపుకుంటున్నారు. ఇదేంటి తేళ్ల పంచమేంటి అని మీకు డౌటు రావొచ్చు.. కానీ అది నిజం. ఈ గ్రామంలో ఏ బండరాయిని ఎత్తినా కుప్పలు తెప్పలుగా తేళ్లు దర్శనమిస్తాయి. సాధారణంగా తేలు మనిషిని కుడితే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతాయి. కానీ కందుకూరులో సంచరించే తేళ్లు మాత్రం కుట్టవని అక్కడి స్థానికులు చెబుతుంటారు.
తేళ్ల పంచమికి భారీగా వచ్చిన ప్రజలు
నాగుల పంచమి రోజునే తేళ్ల పంచమి పండగను కందుకూరు గ్రామంలో ఘనంగా జరుపుతారు. ఈ పండగ రోజున చుట్టు పక్కల ఊళ్ల నుంచే కాదు సరిహద్దులో ఉండే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రజలు భారీ సంఖ్యలో వస్తారు. తేళ్లతో ఆడుకుంటారు. సాధారణంగా శరీరంపై తేళ్లు పాకితే ఒళ్లు జలదరిస్తుంది. కానీ ఈ రోజున మాత్రం ప్రజలు తమ శరీరాలపై తేళ్లను ఉంచుతారు. అవి పై నుంచి కింది దాకా పాకుతుంటాయి. తేళ్లతో ప్రజలు సరదాగా గడుపుతారు.
తేళ్ల పంచమికి ప్రత్యేక ఆలయం
తేలు కుడితే మంటను భరించలేం. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతాయి. అలాంటి విషపురుగులతో తేళ్ల పంచమి రోజున ప్రజలు సయ్యాటలాడుతారు. ఇక ఇందుకోసం ఒక ప్రత్యేక ఆలయమే ఉందంటే మీరు నమ్ముతారా. అవున నిజంగానే ఉంది. తేళ్ల పంచమి నాడు ఈ ఆలయం ప్రజలతో కిటకిటలాడుతుంది. కందుకూరు గ్రామంలో కొండపై కొండమేశ్వరీ ఆలయం ఉంది. ప్రతి నాగుల పంచమి రోజున కొండమ్మదేవి జాతర ఘనంగా జరుగుతుంది. అయితే ఇక్కడ తేళ్ల పంచమి జరుగుతుంది. ఈ రోజున తేళ్లు తమ సహజశైలికి విరుద్ధంగా వ్యవహరిస్తాయి. సాధారణంగా మనిషి తేలును పట్టుకుంటే టక్కున కుడుతాయి. కానీ ఈ రోజున మాత్రం ఆ తేళ్లను ఎవరు పట్టుకున్నా ఎంత సేపు ఆడుకున్న ఒక్కరికంటే ఒక్కరికి కూడా హానీ తలపెట్టవు. ఎవరినీ కుట్టవు.
అసలు చరిత్ర ఇదీ...
ఇక ఒక్కసారి తేళ్ల పంచమి చరిత్రలోకి వెళదాం. కందుకూరులో ఉండే కొండమావుల గుట్ట ఉంది. ఓ వ్యక్తి ఈ గుట్టను తవ్వుతుండగా ఓ పెద్ద తేలు ప్రత్యక్షమైంది. ఇక ఈ తేలును చూసిన ఆ వ్యక్తి భయపడ్డాడు. అప్పుడే తనను ప్రాణాలతో వదిలేస్తే.. అంటే తనను కుట్టకుండా ఉంటే ఓ ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నట్లు స్థానికులు చెబుతారు. ఇక ఆ మాట చెప్పగానే ఆ తేలు అక్కడి నుంచి మాయమైందట. దీంతో ఆ వ్యక్తి ఇచ్చిన మాట ప్రకారం ఆలయం నిర్మించినట్లు ఆ గ్రామస్తులు చెబుతారు. ఇక అప్పటి నుంచి కొండమేశ్వరీ మాతగా పిలుచుకుంటూ ఓ తేలు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతాయి.
ఆ రోజున తేళ్లు కుట్టవట
నాగపంచమి రోజున ఇక్కడ గుట్టపై ఏ రాయి తీసినా తేళ్లు కనిపిస్తాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ రోజు తేళ్లను ముట్టుకున్నా కుట్టవని, ఏడాదిపాటు ఇంట్లోకి ఎలాంటి విషపురుగులూ కూడా రావని వీరు నమ్ముతుంటారు.నాగపంచమి రోజు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇక్కడ అందరూ భయం లేకుండా తేళ్లను పట్టుకుంటారు.ఇక ఈ ఊరిలో ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా ఈ తేళ్ల దేవతను దర్శించుకున్న తర్వాతే ప్రారంభిస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎవరినీ తేలు కుట్టిన దాఖలాలు లేవని ఆలయ పూజారి చెప్పారు.