లవ్ జీహాద్పై తేల్చండి: మతమార్పిడులపై హైకోర్టు ఆగ్రహం
బలవంతపు మత మార్పిడులు, లవ్ జీహాద్ కేసుల వ్యవహారం జాతి ప్రయోజనాలకు భంగకరంగా ఉందని కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.
తిరువనంతపురం: బలవంతపు మత మార్పిడులు, లవ్ జీహాద్ కేసుల వ్యవహారం జాతి ప్రయోజనాలకు భంగకరంగా ఉందని కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. తన ముందుకు వచ్చిన రెండు కేసుల విషయంలో కోర్టు తీవ్రంగా స్పందించింది.
ఇలాంటి ఘటనల్లో డీజీపీ స్వయంగా విచారణను పర్యవేక్షించి, దోషులను కఠినంగా శిక్షించాలని ఆదేశించింది.

మతం మార్చి వివాహం
24ఏళ్ల వయస్సున్న హిందూ యువతిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్పించి, ఆమెకు ఓ ముస్లిం వ్యక్తితో 2016 డిసెంబర్లో చేసిన వివాహం చెల్లుబాటు కాదని తేల్చి చెప్పింది. ఇలాంటి విషయాలపై తక్షణం స్పందించాలని డీజీపీని ఆదేశించింది. మత మార్పిడులను ప్రోత్సహిస్తున్న సంస్థల పాత్రపై విచారణ చేపట్టాలని, మొత్తం రాష్ట్రమంతా డీజీపీ పరిధిలోనే ఉంటుంది కాబట్టి.. ఆయనే స్వయంగా వీటిని పర్యవేక్షించాలని జస్టిస్ కే సురేంద్రమోహన్, జస్టిస్ అబ్రహం మాథ్యూలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

లవ్ జీహాద్ అంటే..
కాగా, ముందుగా హిందూ యువతులను ప్రేమలోకి దింపి ఆ తర్వాత వారిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి అప్పుడు వారిని పెళ్లి చేసుకోవడాన్నే లవ్ జీహాద్ అంటున్నారు.

ఓ తండ్రి వేదన
కేరళలో ఇందుకోసం ఏకంగా కొన్ని సంస్థలే ఏర్పాటయ్యాయి. తన కూతురును కొన్ని సంస్థలు బలవంతంగా మతం మార్పించి, ఒక ముస్లిం వ్యక్తితో ఆమె పెళ్లి చేస్తున్నాయని ఓ యువతి తండ్రి 2016 ఆగస్టులో హైకోర్టులో హేబియస్ కార్పస్ దాఖలు చేశారు. ఆమెను బలవంతంగా సిరియా పంపి, ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలలో చేర్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ధర్మాసనం వ్యాఖ్య
తాను మేజర్నని, తన ఇష్టం మేరకే మతం మారి పెళ్లి చేసుకున్నానని ఆమె కోర్టులో చెప్పినా.. కోర్టు మాత్రం ఆ వివాహాన్ని చట్టపరంగా రద్దు చేసి.. ఆమెను తల్లిదండ్రులకు అప్పగించింది. హోమియోపతి వైద్య విద్య చదువుతున్న ఓ 24ఏళ్ల యువతి అన్ని వదిలిపెట్టి ఉన్నట్టుండి మతం మారి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటుందని, దీని వెనక కొంతమంది లేదా సంస్థల బలవంతం ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది, అంతేగాక, ఆమె తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క సంతానం, ఆమెకు ఈ ప్రపంచంలో మరెవరితోనూ సంబంధం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications