సౌరవ్ గంగూలీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
కోల్కత: ఐపీఎల్ 2023 సీజన్ ఇక ముగింపు దశకు వచ్చింది. ఈ నెల 21వ తేదీన చివరి లీగ్ మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్లో తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్టామి స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ఈ చివరి లీగ్ షెడ్యూల్ అయింది. ప్లేఆఫ్స్ చేరాలంటే రాయల్ ఛాలెంజర్స్కు గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది.
ఇవ్వాళ ఢిల్లీ కేపిటల్స్-పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు ధర్మశాలలో ఏర్పాటైంది ఈ మ్యాచ్. ఇప్పటికే ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ కేపిటల్స్ వైదొలగింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్లల్లో గెలిచింది నాలుగంటే నాలుగే. ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. చేతిలో రెండు మ్యాచ్లు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్తో పాటు చివరి లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది.

పంజాబ్ కింగ్స్ పరిస్థితి మాత్రం దీనికి భిన్నం. ఈ మ్యాచ్లో భారీ తేడాతో నెగ్గితే ప్లేఆఫ్స్ ఆశలను నిలుపుకొనే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 12 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. ఢిల్లీ కేపిటల్స్తో పాటు మరో మ్యాచ్ మిగిలేవుంది. ఈ రెండూ గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్కు చేరువ అవుతుంది. అందుకే ఇందులో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది పంజాబ్ కింగ్స్.
కాగా- ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీ డైరెక్టర్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ మాజీ ఛైర్మన్ సౌరవ్ గంగూలీకి కల్పిస్తోన్న భద్రతను పెంచింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ప్రస్తుతం ఆయనకు వై- కేటగిరి భద్రతను కల్పిస్తోంది మమత బెనర్జీ సర్కార్. దీని కాలపరిమితి ఇవ్వాళ్టితో ముగిసిపోయింది. దీన్ని రెన్యూవల్ చేయనున్నట్లు పశ్చిమబెంగాల్ పోలీస్ అధికారులు ప్రకటించారు. అప్గ్రేడ్ చేస్తామని వెల్లడించారు. వై నుంచి జెడ్ కేటగిరీకి అప్గ్రేడ్ చేయనున్నామని అన్నారు.
కోల్కతలోని బెహాలా ఏరియాలో తన కుటుంబంతో కలిసి నివసిస్తోన్నారు సౌరవ్ గంగూలీ. ప్రస్తుతం ఆయన ఢిల్లీ కేపిటల్స్ జట్టు వెంట ఉంటోన్నారు. లీగ్ మ్యాచ్లు ముగిసిన వెంటనే అంటే- ఈ నెల 21వ తేదీన కోల్కతకు వెళ్లనున్నారు. ఆ వెంటనే ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత అందుతుందని కోల్కత పోలీస్ కమిషన్ వివరించారు.
జెడ్ కేటగిరీ కింద ఆయనకు ఇకపై 8 నుంచి 10 మంది పోలీసులు బాడీగార్డులుగా ఉంటారు. అలాగే- బెహాలా ఇంటివద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేస్తారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, ముఖ్యమంత్రి మమత బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, మంత్రులు ఫిర్హాద్ హకీం, మొలొయ్ ఘటక్, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సుకాంత మజుందార్కు మాత్రమే జెడ్ కేటగిరీ భద్రత ఉంది.












Click it and Unblock the Notifications