మహిళ అభ్యంతరకర ఫోటోలు తీసిన ఐపిఎస్కు పోస్టింగ్
బెంగళూరు: మహిళ అభ్యంతకర ఫోటోలు తీసిన ఐపిఎస్ అధికారికి పోస్టింగ్ ఇవ్వడం వివాదానికి దారి తీసింది. కర్నాటకలో ఒక కాఫీ షాప్లో ఓ మహిళను అభ్యంతకరంగా ఫోటోలు తీశారనే ఆరోపణలు వచ్చిన సీనియర్ ఐపిఎస్ అధికారి పి రవీంద్రనాథ్కు ప్రభుత్వం తాజాగా పోస్టింగ్ ఇచ్చింది.
ఆ మహిళ ఫిర్యాదు నేపథ్యంలో కర్నాటక రిజర్వ్ పోలీసు అదనపు డీజీపీగా ఉన్న ఆయనను ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం బదలీ చేసింది. ఇప్పుడు పరిశోధన, పునర్నిర్మాణం విభాగం అదనపు డీజీపీగా నియమించింది. మహిళ ఫిర్యాదు, రవీంద్రనాథ్ బదలీ వ్యవహారంతో పోలీసు ఉన్నతాధికారుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.

రవీంద్రనాథ్ను బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర లక్ష్యంగా చేసుకున్నారని, ఆయనను కేసులో ఇరికిస్తున్నారని ఆరోపిస్తూ కర్నాటక రిజర్వ్ పోలీసు సిబ్బంది కొందరు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
మరోవైపు రవీంద్రనాథ్ ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద రాఘవేంద్రపై ఫిర్యాదు దాఖలు చేశారు. కేసు దర్యాఫ్తును ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. రవీంద్రనాథ్ సోమవారం విచారణ నిమిత్తం సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు.












Click it and Unblock the Notifications