యాదవ్ అని ఉంటే చాలు, యోగిపై వ్యాఖ్యలు: ఐపిఎస్పై వేటు
యోగి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఐపిఎస్ అధికారి సస్పెన్షన్కు గురయ్యారు. ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆయన అన్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై వ్యాఖ్యలు చేసినందుకు యుపి క్యాడర్ ఐపిఎస్ అదికారి హిమాంశు కుమార్పై వేటు వేశారు. ఆయనను లక్నోలోని డిజిపి ఆఫీసుకు అటాచ్ చేశారు. 2010 బ్యాచ్కు చెందిన హిమాంశు ఈ నెల 22వ తేదీన యుపిలో యోగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీనియర్ పోలీసు అధికారులు కిందిస్థాయి అధికారులను ముఖ్యంగా ఒక కులానికి చందినవారిని లక్ష్యం చేసుకున్నారని ట్వీట్ చేశారు.
పేరు పక్కన యాదవ్ ఉన్నవారిని సస్పెండ్ చేయడం గానీ లూప్ లైన్లో పెట్టడం గానీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఓ కులానికి చెందినవారిపై చర్యలు తీసుకోవాలని డిజిపి కార్యాలయం ఒత్తిడి చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఆ ట్వీట్స్ దుమారం రేపడంతో ఆయనను వెంటనే తొలగించారు. కొందరు తన ట్వీట్లను తప్పుగా అర్థం చేసుకున్నరని, ప్రభుత్వ నిర్ణయాలకు తాను మద్దతు పలికానని ఆయన వివరణ ఇచ్చారు. హిమాంశు ట్వీట్స్ను ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. విచారణకు ఆదేశించారు.
తనను సస్పెండ్ చేయడంపై కూడా హిమాంశు స్పందించారు. సత్యం మాత్రమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఆయన గతంలో మణిపూర్, ఫిరోజాబాద్ జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం డిజిపి ఆఫీసుకు బదిలీ చేసింది.