దెబ్బ కొట్టిన ఇరాన్: భారత్ లో మళ్లీ ఎల్పీజీ, ఆయిల్ క్రైసిస్?
అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. స్ట్రెయిట్ ఆఫ్ హొర్ముజ్ ను మరోసారి మూసివేసింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించింది. హోర్ముజ్ స్ట్రెయిట్ నుంచి వెళ్లే ఏ నౌకను తాము వదిలిపెట్టబోమని, దాడులు చేస్తామని ఐఆర్జీసీ హెచ్చరించడంతో ఈ మార్గంలో అంతర్జాతీయ వాణిజ్యానికి భారీ ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ పరిణామం భారత్ లో ఇంధన భద్రతపై ఆందోళనలను రేకెత్తిస్తోంది.
తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ కథనాల ప్రకారం.. ఇరాన్ అత్యున్నత సైనిక కమాండ్ ఈ జలమార్గం గుండా ఎలాంటి నౌకల రాకను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఒకవేళ ఏ నౌక అయినా ఈ ప్రాంతంలో ప్రయాణించడానికి ప్రయత్నిస్తే, అది దాడికి గురవుతుందని హెచ్చరించింది. ఈ మార్గం గుండా వెళ్లడానికి ప్రయత్నించిన రెండు నౌకలపై దాడి చేసినట్లు సమాచారం. ఆ నౌకల వివరాలు లేదా వాటి కార్గో గురించి పూర్తి స్పష్టత రాలేదు.

తమ అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతీకాంగా అమెరికా రెండు రోజుల కిందటే ఇరాన్ పై దాడులను తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ నుంచి ఎదురవుతున్న దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు తీసుకున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. కెష్మ్, బందర్ అబ్బాస్, సిరిక్ నగరాల్లో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. దీని తర్వాత ఇరాన్ లో అనూహ్య పరిణామాలు తలెత్తాయి. ఆ దేశం కూడా పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధపడింది. ఏ ఒత్తిడికి తలొగ్గేది లేదని అధ్యక్షుడు మసూద్ పేజెష్కియాన్ స్పష్టం చేశారు.
ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ రంగంలోకి దిగింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ను సీల్ చేసింది. ఏ నౌక కూడా ఇక్కడి నుంచి వెళ్లడానికి అంగీకరించబోమని తెలిపింది. తాజా ఆంక్షలు భారత్ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. భారత్ తన మొత్తం ముడి చమురు దిగుమతులలో 40, ఎల్ ఎన్ జీలో 50, ఎల్పీజీలో 90 శాతం వరకు ఈ జలమార్గం ద్వారానే పొందుతోంది. మార్చిలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.












Click it and Unblock the Notifications