ఐసిస్ జిహాదీల తలలతో కూరలు వండేస్తోన్న మహిళ
బాగ్దాద్ : ఉగ్రవాదంతో ప్రపంచ దేశాలకు వణకు పుట్టిస్తోన్న ఐసిస్ కు ఓ మహిళ ఎదురు నిలిచి పోరాడుతోంది. పోరాడడమే కాదు.. ఐసిస్ ఉగ్రమూకల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఐసిస్ తీవ్రవాదులు తన చేతికి చిక్కితే చాలు.. వారి తలలను తెగనరికి కూరలు వండేస్తోంది.
ఐసిస్ చీఫ్ బాగ్దాదీ సైతం ఆమెకు దొరక్కుండా జాగ్రత్త పడాలని జిహాదీలకు సంకేతాలిచ్చారంటే.. ఐసిస్ పాలిట ఆమె ఎంతటి సింహ స్వప్నంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఐసిస్ కు అంతలా వణుకు పుట్టిస్తోన్న ఆ సింహ స్నప్నం.. ఇరాకీ మిలటరీ కమాండర్ వహీదా. తన కుటుంబాన్ని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారన్న కారణంతో.. ఐసిస్, ఆల్ కాయిదా లాంటి తీవ్రవాదుల భరతం పడుతోంది.
తీవ్రవాదుల దాడులకు వహీదా ఇద్దరు భర్తలు, తండ్రి, ముగ్గురు సోదరులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటినుంచి ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న వహీదా 2004లో ఇరాక్ సైన్యంలో చేరారు. అలా.. సైన్యంలో కమాండర్ స్థాయి వరకు చేరుకున్న వహీదా.. ప్రస్తుతం ఉగ్రవాదుల ఏరివేతనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాగా, గతంలోను ఉగ్రవాదుల తలలు నరికి ఆమె తన చేతులతో తలలను పట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
అదే సమయంలో ఉగ్రవాదుల తలలతో వహీదా కూరలు వండుతోందన్న రిపోర్టులు కూడా వెలువడడం సంచలనం సృష్టించాయి. ఐసిస్ ను ఇంతలా టార్గెట్ చేసిన వహీదాను మట్టుబెట్టడానికి ఐసిస్ సహా ఆల్ కాయిదా కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. 2006-2014 మధ్య కారు బాంబులు సహా పలు కుయుక్తులతో ఆమెను మట్టుబెట్టడానికి ప్రయత్నించినా.. ముష్కరుల చర్యలు విఫలమయ్యాయి.
అతి సమీపం నుంచి ఒకసారి దాడి జరిగినప్పుడు మాత్రం ఆమె తలకు చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. అయినప్పటికీ.. వెన్ను చూపని ధీర వనితలా తన పోరాటాన్ని కొనసాగిస్తోంది వహీదా. 'ఇరాక్ ప్రధాని కంటే వహీదాను మట్టుబెట్టడానికే ఐసిస్ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తోందని' వహీదా చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఐసిస్ ను ఆమె ఎంతలా గడగడలాడిస్తుందో అర్దం చేసుకోవచ్చు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే తన చివరి రక్తపు బొట్టు వరకు ఉగ్రవాదులతో పోరాటానికి వెరసేది లేదని చెబుతోంది వహీదా.