నిరాడంబరంగా ఇరోమ్ షర్మిల పెళ్లి: ఎవరూ రాకపోవడంపై వివరణ
చెన్నై: ఉక్కు మహిళ, మణిపూర్ పౌరహక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల వివాహం బ్రిటీష్ పౌరుడు డెస్మండ్ కౌటినోతో ఘనంగా జరిగింది. తమిళనాడులోని కొడైకెనాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో షర్మిల వివాహం గురువారం నిరాడంబరంగా జరిగింది.
ఎవరూ హాజరై కాలేదు..
ప్రత్యేక వివాహ చట్టం 1954 ప్రకారం.. షర్మిల, కౌటినో ఒక్కటయ్యారు. ఇరోమ్ షర్మిల, కౌటినోతో పాటు వీరి పెళ్లిని వీడియో తీసే వ్యక్తి మినహా ఎవరూ ఈ పెళ్లికి హాజరుకాకపోవడం గమనార్హం.
ఆహ్వానం పంపలేదు..
‘మా అమ్మకు ఆరోగ్యం బాగోలేక పోవడంతో ఫోన్ ద్వారా ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నాను. ఇక మిగతా బంధువులకు మేం ఎలాంటి ఆహ్వాన పత్రిక ఇవ్వలేదు. కాబట్టి ఎవరూ రాలేదు' అని షర్మిల తెలిపారు.
మరోసారి వేడుకగా..
గురువారం ఉదయం 10:30కి తమ వివాహ ధ్రువీకరణ పత్రం అందజేశారు. త్వరలో కొడైకెనాల్లోని చర్చిలో బంధువులను పిలిచి వేడుక జరుపుతామని షర్మిల వెల్లడించారు.
రాజకీయాలకు స్వస్తి..
మణిపూర్ పౌరహక్కుల కోసం పోరాడిన షర్మిల గత కొంతకాలం క్రితమే నిర్బంధం నుంచి విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఆమె రాజకీయాల్లో వచ్చేందుకు ఎన్నికల్లోనూ పోటీ చేశారు. కానీ, ప్రజల నుంచి ఆమెకు అంతగా మద్దతు లభించలేదు. దీంతో ఆమె కొంత నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు చెప్పారు.