హత్రాస్ గ్యాంగ్ రేప్ : బిక్కుబిక్కుమంటూ బాధిత కుటుంబం.. నిందితులకు మద్దతుగా కదిలిన 12 గ్రామాలు
దేశవ్యాప్తంగా హత్రాస్ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. బాధితురాలికి,ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు డిమాండ్ చేస్తున్నారు. విపక్షాలు రోడ్డెక్కి యూపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని నిరసిస్తున్నాయి. యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డవాళ్లు అగ్ర వర్ణాలకు చెందినవారు కావడంతో.. బాధిత కుటుంబాన్ని నయానో,భయనో ప్రభావితం చేసే అవకాశం ఉందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. అటు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు కూడా ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

తీవ్ర ఒత్తిడి,భయాందోళనలో ఉన్నాం : బాధిత కుటుంబం
ప్రస్తుతం హత్రాస్లోని బూల్గర్హిలో ఉన్న బాధిత కుటుంబం ఇంటి వద్ద భారీ పోలీసు పహారా ఉంది. బాధిత కుటుంబంతో నేరుగా మాట్లాడేందుకు... వాళ్ల పరిస్థితి గురించి తెలుసుకునేందుకు దాదాపుగా ఎవరికీ అవకాశం లేదు. విపక్షాలనే కాదు,మీడియాను కూడా ప్రభుత్వం అక్కడికి అనుమతించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే ఎలాగోలా బాధితులతో మాట్లాడగలిగింది. మీడియాతో బాధిత కుటుంబం చెప్పిన మాటలు షాకింగ్గా ఉన్నాయి. ప్రస్తుతం తమపై తీవ్ర ఒత్తిడి నెలకొందని... తీవ్ర భయాందోళనలో ఉన్నామని ఆ కుటుంబం వాపోయింది.

నిందితులకు మద్దతుగా 12 గ్రామాలు...
స్థానిక అధికారులు తమ కుటుంబాన్ని కలిసి.. 'మీరేమీ బాధపడకండి... మీ కొడుకులను మేము కాపాడుతామని...' చెప్పినట్లు తెలిపారు. అంటే,ఆ కుటుంబానికి నిందితుల వైపు నుంచి ప్రాణ హానీ పొంచి ఉందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు సీర్పీసీ సెక్షన్ 144 నిబంధనలను అతిక్రమిస్తూ హత్రాస్ చుట్టుపక్కల 12 గ్రామాలకు చెందిన సవర్ణ సమాజ్ సభ్యులు నిందితులకు మద్దతుగా పంచాయతీ నిర్వహించారు. ఘటనపై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేశారు. అలాగే నిందితులకు,బాధిత కుటుంబానికి నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అప్పుడే అసలు నిజాలు బయటపడుతాయని... అమాయకులు రక్షించబడుతారని పేర్కొన్నారు.

సవర్ణ సమాజ్ ఆధ్వర్యంలో ధర్నా
దేశమంతా హత్రాస్ బాధితురాలి కోసం గొంతుతెత్తున్న తరుణంలో ఆ 12 గ్రామాల ప్రజలు సవర్ణ సమాజ్ ఆధ్వర్యంలో నిందితులకు మద్దతుగా ధర్నా కూడా నిర్వహించారు. హత్రాస్ గ్రామానికి కేవలం 5కి.మీ దూరంలో ఉన్న బాగ్నా గ్రామంలో ఈ ధర్నా జరిగింది. ధర్నాకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు. 'ఒకవేళ మా పిల్లలు తప్పు చేసినట్లు తేలితే వాళ్లను ఉరితీయండి. కానీ విచారణను సిట్ లేదా సీబీఐతో జరిపించండి.' అని సవర్ణ సమాజ్ సభ్యులు డిమాండ్ చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ఘటనను వాడుకుంటున్నాయని ఆరోపించారు. బాధితురాలి తల్లిని,సోదరుడిని ప్రశ్నిస్తే అసలు నిజాలు బయటపడుతాయన్నారు.
Recommended Video

తెర పైకి కుల సంఘాలు...
మరోవైపు బాధితురాలి కుటుంబానికి సంఘీభావంగా వాల్మీకి కులం సంఘం ఢిల్లీలోని పంచకుల మార్గ్లో ఉన్న వాల్మీ ఆలయంలో ఓ ప్రార్థన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యారు. బాధితురాలి వైపు దళిత,ప్రజా సంఘాలు,విపక్షాలు పోరాడుతంటే... నిందితులకు మద్దతుగా స్థానిక సవర్ణ కులాలు కదలడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం హత్రాస్లో సెక్షన్ 144 విధించారు.రోడ్లపైకి ఎవరూ రాకూడదని ఆంక్షలు విధించారు. బాధితురాలి ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హత్రాస్ వ్యవహారంలో ఎప్పుడేం ఏం జరుగుతోందని దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే యూపీ ప్రభుత్వం ఈ ఘటనపై సిట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications