లిఫ్ట్ ఇస్తామని ఇజ్రాయెల్ మహిళపై కారులో రేప్
మనాలి: దేశంలో విదేశీ మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. తాజాగా కులుమనాలిలో అటువంటి సంఘటన చోటు చేసుకుంది. లిప్ట్ ఇస్తామంటూ 25 ఏళ్ల ఇజ్రాయిల్ మహిళను కారు ఎక్కించుకున్న ఇద్దరు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.
ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలీలో జరిగింది. స్పిటీ లోయలో కాజా ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన ఇజ్రాయిల్ మహిళ టాక్సీ కోసం ఎదురుచూస్తుండగా నెంబరు ప్లేటు లేని ఓ కారు వచ్చి ఆగింది. లిఫ్ట్ ఇస్తామంటూ కారులో ఎక్కించుకున్నారు.
కారులో ఆరుగురున్నారు. అయితే ఇద్దరు యువకులు తనపై అత్యాచారం జరిపారని సదరు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి గురైన ఇజ్రాయిల్ మహిళను వైద్యపరీక్షలు చేయించి వైద్యుల సలహా కోసం మండీకి పంపించామని కులూ ఎస్పీ పాదం చంద్ చెప్పారు.
కారుతోపాటు నిందితులను గుర్తించడంలో బాధితురాలు విఫలమయ్యారు. దీంతో తాము సీసీటీవీ ఫుటేజీ సాయంతో కేసు దర్యాప్తు చేస్తున్నామని, బాధితురాలి ఫిర్యాదును రిజిస్టరు చేశామని ఎస్పీ చెప్పారు. అత్యాచార సంఘటన తెల్లవారు జామున జరిగినందున తాము నైట్ విజన్ కెమేరా ఫుటేజీని పరిశీలిస్తున్నామని ఎస్పీ వివరించారు.
గత నాలుగేళ్లలో కులూ జిల్లాలో ముగ్గురు విదేశీ వనితలపై అత్యాచారం సంఘటనలు జరిగాయి. 2013వ సంవత్సరం జూన్ నెలలో 29 ఏళ్ల అమెరికన్ మహిళపై ముగ్గురు నేపాలీ యువకులు అత్యాచారం జరిపారు. 2012వ సంవత్సరం మే నెలలో చంఢీఘడ్కు చెందిన ఓ యువకుడు ఫేస్ బుక్ ద్వారా పరిచయమై కులూ పర్యటనకు వచ్చి 22 ఏళ్ల ఆస్ట్రేలియన్ మహిళపై అత్యాచారం చేశాడు.