Paul Dhinakaran జీసస్ కాల్స్ సంస్థలపై ఐటీ దాడులు .. ఎన్నికలకు ముందే..!
చెన్నై: ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు డాక్టర్ పాల్ దినకరన్ నేతృత్వంలో నిర్వహిస్తున్న జీసస్ కాల్స్ మిషనరీపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది. జీసస్ కాల్స్ మిషనరీకి ప్రధాన కార్యాలయంగా ఉన్న చైన్నై, కోయంబత్తూరులోని 28 ప్రాంతాలతో పాటు ఇతర ప్రదేశాల్లో కూడా ఏకకాలంలో ఆదాయపు పన్న శాఖ సోదాలు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం నుంచే ఈ ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి.
ఇక దినకరన్ కుటుంబానికి చెందిన కరుణ క్రిస్టియన్ స్కూల్, కారుణ్య యూనివర్శిటీ పై కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయపు పన్ను ఎగవేసినట్లు సమాచారం రావడంతోనే ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు విదేశీ నిధుల్లో కూడా అవకతవకలు ఉన్నాయన్న ఫిర్యాదు ఐటీ శాఖకు అందడంతో సోదాలు నిర్వహించారు. పాల్ దినకరన్ సంస్థలపై జీసస్ కాల్స్ మిషనరీపై ఐటీ సోదాలను పలువురు రాజకీయ నేతలు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కావాలనే ఒక మతంను లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్న దాడులుగా వారు అభిప్రాయపడ్డారు.

ఇక జీసస్ కాల్స్ మిషనరీ కొన్ని దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు జీసస్ కాల్స్ మిషనరీ లేదా దినకరన్ కుటుంబం నిర్వహిస్తున్న కాలేజీలపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని పలువురు చెబుతున్నారు. ఇక తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో క్రైస్తవులను టార్గెట్ చేసి ఎన్నికలకు మతం రంగు పులుముతున్నారని పలువురు క్రైస్తవ మత పెద్దలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వాలు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగాయని మండి పడ్డారు.
మొత్తానికి పాల్ దినకరన్ జీసస్ కాల్స్ మిషనరీపై వారి విద్యాసంస్థలపై ఐటీ దాడులు జరగడంతో చాలా మంది క్రైస్తవులు షాక్కు గురయ్యారు.












Click it and Unblock the Notifications