అనూహ్యమే, దాన్ని అధిగమిస్తాం: అవిశ్వాసంపై చాకో
న్యూఢిల్లీ: తమ పార్టీ లోకసభ సభ్యులు తమ యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాసానికి నోటీసులు ఇవ్వడం అనూహ్య పరిణామమేనని, అయితే దాన్ని అధిగమిస్తామని ఎఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో అన్నారు. సీమాంధ్రకు చెందిన ఆరుగురు కాంగ్రెసు లోకసభ సభ్యులు యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాసానికి సోమవారం స్పీకర్ మీరా కుమార్కు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణపై అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ తమ పార్టీ బాహాటంగానే నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. సరైన సమయంలో మాట్లాడకుండా తమ పార్టీ లోకసభ సభ్యులు ఇలా చేయడం సరి కాదని ఆయన అన్నారు. అవిశ్వాసం ఊహించని పరిణామమే అయినా సమర్ధంగా అధిగమిస్తామని ఆయన చెప్పారు. అవిశ్వాస తీర్మానం ముందుకు వచ్చినప్పుడు దానిపై చర్చిస్తామని ఆయన చెప్పారు.

కాంగ్రెసుకు చెందిన ఆరుగురు పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు నలుగురు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు ముగ్గురు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు.
నోటీసు ఇవ్వడానికి సంఖ్యాబలం అవసరం లేకున్నప్పటికీ అవిశ్వాసం చర్చకు రావాలంటే కనీసం 55 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ఈ అవిశ్వాస తీర్మానాల విషయాన్ని రేపు మంగళవారం స్పీకర్ మీరా కుమార్ సభలో ప్రస్తావించే అవకాశాలున్నాయి. ఎంత మంది మద్దతు ఉన్నదనే విషయాన్ని తెలుసుకుని చర్చకు అనుమతించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications