సమంత, నయనతార, విజయ్ ఇళ్లపై ఐటి దాడులు
చెన్నై: పులి సినిమా హీరో విజయ్, హీరోయిన్లు సమంత, నయనతార ఇళ్లపై ఆదాయం పన్ను (ఐటి) శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి ఈ దాడులు ప్రారంభమయ్యాయి. పులి నిర్మాత, సహాయ దర్శకుడు తదితరుల ఇళ్లపై కూడా ఐటి సోదాలు జరుగుతున్నాయి.
తమిళనాడు రాజధాని చెన్నైలోని వారి ఇళ్లలో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు. బుధవారం సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగే అవకాశం ఉంది. నల్లధనం పాత్ర ఏమైనా ఉండవచ్చుననే అనుమానంతో ఐటి అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
మధురై, తిరువనంతపురంల్లోని నివాసాల్లో కూడా ఐటి దాడులు దాడులు జరుగుతున్నాయి. ఐటి అధికారుల సోదాలు పూర్తయితే తప్ప వివరాలు తెలిసే అవకాశం లేదు. వారేమైనా స్వాధీనం చేసుకున్నారా, లేదా అనేది కూడా ఆ తర్వాతే తెలుస్తుంది.
చెన్నై సహా దేశ వ్యాప్తంగా 32 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. తిరువనంతపురం, కొచ్చిలోని నయనతార ఇళ్లలో, చెన్నై, హైదరాబాద్లోని సమంత ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. హీరో విజయ్ నటించిన 'పులి' చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు.
నిజానికి ఈ చిత్రానికి సమంత, నయనతారలకు ఎలాంటి సంబంధం లేదు. అయినా వారి ఇళ్ళలో కూడా సోదాలు నిర్వహించడం గమనార్హం. అలాగే, 'పులి' చిత్ర నిర్మాతలు ఎస్.థమీన్స్, పీటీ సెల్వకుమార్ ఇళ్ళలో కూడా ఈ సోదాలు నిర్వహించారు. కాగా, పులి చిత్రం అక్టోబర్ ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.