మేడమ్ సీఎం.. ఇది 1817 కాదు.. 2017: రాజస్థాన్ సీఎంపై రాహుల్ గాంధీ ట్వీట్
మేడం ముఖ్యమంత్రిగారు! మనమంతా 21వ శతాబ్దిలోని మానవత్వ సమాజంలో ఉన్నాం. ఇది 2017.. 1817 కాదు.. అని రాజస్థాన్ సీఎం వసుంధర రాజె సింధియాను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు
న్యూఢిల్లీ: మేడం ముఖ్యమంత్రిగారు! మనమంతా 21వ శతాబ్దిలోని మానవత్వ సమాజంలో ఉన్నాం. ఇది 2017.. 1817 కాదు.. అని రాజస్థాన్ సీఎం వసుంధర రాజె సింధియాను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ప్రభుత్వ అనుమతి లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, జడ్జిలపై వ్యక్తులు నమోదు చేసే కేసులను కోర్టులు విచారణకు స్వీకరించవద్దన్న రాజస్థాన్ ప్రభుత్వం ప్రతిపాదిత ఆర్డినెన్స్ను ఆయన తప్పుబట్టారు.
'రాజస్థాన్ ఆర్డినెన్స్ భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకమని చెబుతున్న న్యాయ నిపుణులు' అనే వార్తా కథనాన్ని కూడా రాహుల్ గాంధీ తన ట్వీట్కు ట్యాగ్ చేశారు.
ఈ ఆర్డినెన్స్ సాయంతో అనుమతి లేకుండా మేజిస్ట్రేట్లు, ప్రభుత్వ అధికారులపై వార్తా కథనాలు ప్రచురించొద్దని మీడియాపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వసుంధరా రాజె సింధియా ప్రభుత్వం సదరు క్రిమినల్ చట్టాలు (సవరణ) ఆర్డినెన్స్ 2017ను సోమవారం ఆమోదించనున్నట్లు వార్తలొచ్చాయి.
Madam Chief Minister, with all humility we are in the 21'st century. It's 2017, not 1817. https://t.co/ezPfca2NPS
— Office of RG (@OfficeOfRG) October 22, 2017
ఒకవేళ ఈ ఆర్డినెన్స్ను ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి రెండేళ్లపాటు జైలుశిక్ష విధిస్తారు. అయితే ఈ ఆర్డినెన్స్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) రాజస్థాన్ రాష్ట్ర అధ్యక్షురాలు కవితా శ్రీవాత్సవ డిమాండ్ చేశారు. అంతేకాదు, దీన్ని సోమవారం హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు ఆమె తెలిపారు.
అయితే అవినీతి అధికారులను రక్షించేందుకు ఆర్డినెన్స్లో ఎటువంటి నిబంధనలు లేవని శనివారం రాత్రి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ పథకాల ప్రచారంపై అడ్డంకులను తొలిగించేందుకే ఈ ఆర్డినెన్స్ జారీ చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి గులాబ్చంద్ కటారియా సమర్థించుకున్నారు.
మరోవైపు రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తాము అసెంబ్లీలో సవాల్ చేస్తామని తెలిపారు.