ఆ సీఎం పక్కలో బల్లెం: తమిళనాడు కేడర్ ఐపీఎస్ అధికారికి కీలక పోస్టింగ్ ఇచ్చిన అమిత్ షా
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానాను కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి తప్పించింది. ఆయనను బదిలీ చేసింది. ఆ స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ అరోరాను నియమించింది. ప్రస్తుతం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) డైరెక్టర్ జనరల్గా సంజయ్ అరోరా పని చేస్తోన్నారు. ఆయనను అక్కడి నుంచి బదిలీ చేసింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
సంజయ్ అరోరా స్వరాష్ట్రం రాజస్థాన్. 1988 బ్యాచ్- తమిళనాడు కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి. డెప్యుటేషన్ మీద కేంద్ర సర్వీసుల్లో పని చేస్తోన్నారు. గత సంవత్సరం ఆగస్టులో ఐటీబీపీ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు. అలాగే ఇండో-చైనా వాస్తవాధీన రేఖ పహారా బలగాల ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తోన్నారు. తమిళనాడు పోలీస్ స్పెషల్ టాస్క్ఫోర్స్ ఎస్పీగా పని చేశారు. ఆ సమయంలో స్మగ్లింగ్ కింగ్ వీరప్పన్ ముఠా ఏరివేతలో సంజయ్ అరోరా కీలక పాత్ర పోషించారు.
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం కార్యకలాపాలు విస్తృతంగా కొనసాగుతున్న సమయంలోనూ సంజయ్ అరోరా తమిళనాడులో కీలక బాధ్యతల్లో పని చేశారు. చీఫ్ మినిస్టర్ గ్యాలంట్రీ అవార్డ్ను కూడా అందుకున్నారాయన. ఆయన సర్వీసు 2025 వరకు ఉంది. ఢిల్లీ పోలీస్ యంత్రాంగం మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. లెప్టినెంట్ గవర్నర్ ఢిల్లీ పోలీస్ యంత్రాంగాన్ని పర్యవేక్షిస్తుంటారు.
ఢిల్లీ పోలీస్ విభాగంలో అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం-యూనియన్ టెరిటరీస్ (ఏజీఎంయూటీ) క్యాడర్కు చెందిన అధికారులను నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అదే ఆనవాయితీని కొనసాగించింది. సంజయ్ అరోరాను ఏజీయూఎంటీ ఇంటర్ క్యాడర్ డెప్యుటేషన్ కింద తీసుకుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించినట్లు కేంద్రం హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ వెంటనే ఆయనను ఢిల్లీ పోలీస్ కమిషనర్గా అపాయింట్ చేసినట్లు వెల్లడించింది.
సంజయ్ అరోరాను ఢిల్లీ పోలీస్ కమిషనర్గా నియమించడం అటు రాజకీయంగానూ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలుసుకొన్నారు. ఆ వెంటనే సంజయ్ అరోరా నియామకం చోటు చేసుకుంది. ఢిల్లీ పోలీస్ కమిషనర్గా ఐటీబీపీలో పని చేస్తోన్న సంజయ్ అరోరాను తీసుకుని రావడం చర్చనీయాంశమైంది.